హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేసషన్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా (Hyderabad Disaster Response Assets Monitoring and Protection Agency) కొత్త పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఇది దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ సందర్భంగా 21 DRF వాహనాలు, 4 ఇన్నోవా కార్లు, 55 స్కార్పియోలు, టూక్యారియర్ వ్యాన్లు, బైక్లు ప్రారంభించారు. అలాగే, CGG రూపొందించిన HYDRAA నూతన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా చర్యలపై కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారు పేదల ఇళ్లనే కూలుస్తున్నారన్నదానిపై అపోహలు సృష్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు. "ఒకవేళ నగరం నాశనం అయినా, వాళ్లకు సంబంధం లేదు. కానీ మూసీ ఒడ్డున పేదలు ప్రమాదకర పరిస్థితుల్లో జీవించాలంటారు. జన్వాడ, ఎర్రవల్లిలో ఫామ్హౌసులు కట్టించుకుంటారు," అని రేవంత్ ప్రశ్నించారు.
మాజీ ఎంపీ వి.హనుమంతరావు 25 ఏళ్లుగా పోరాడి బతుకమ్మకుంట భూమిని తిరిగి పొందారనీ, ఈ సంవత్సరం అక్కడే బతుకమ్మ వేడుక జరపాలని సీఎం తెలిపారు. "మూసీ ఒడ్డున ఉన్న పేదల పునరావాసానికి ప్రత్యేకంగా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం.. ప్రభుత్వ భూములు ఉన్న చోట 400–500 చదరపు అడుగుల ఫ్లాట్లు కట్టిస్తామన్నారు.
పిల్లలకు విద్య, వారికి ఉపాధి, జీవనాధారాలన్నీ అందిస్తామన్నారు. పునరావాసం ఎలా కల్పించాలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది ఒడ్డున నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులు రాబోయే రోజుల్లో సమావేశాలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నివాసాలను తొలగించేటప్పుడు, పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ప్రత్యామ్నాయ నివాసం చూపించాలని సూచించారు. అయితే, ధనవంతుల ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.