హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెంపుడు శునకం దాడి చేయడంతో యజమాని మృతి చెందాడు. య‌జ‌మాని దాడిలో మృతుడి మ‌ర్మంగాన్ని కొరికిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లాకు చెందిన డి. పవన్‌కుమార్ (37) అనే వ్యక్తి, తన స్నేహితుడు సందీప్‌తో కలిసి గత ఐదేళ్లుగా మధురానగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేటు సంస్థలో క్యాషియర్‌గా పని చేస్తున్న పవన్, ఇటీవల అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. ప్రతిరోజూ ఆసుపత్రికి సందీప్‌ సహాయంతో వెళ్లి వస్తుండేవాడు.

శనివారం రాత్రి కూడా ఆసుపత్రి నుండి వచ్చిన పవన్, సుమారు రాత్రి 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆయన పక్కనే తన పెంపుడు కుక్క కూడా నిద్ర పోతోంది. ఆదివారం ఉదయం సందీప్ ఎన్నిసార్లు తలుపు తట్టినా ప‌వ‌న్ స్పందించ‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చిన సందీప్ స్థానికుల స‌హ‌కారంతో తలుపు ప‌గ‌లొట్టాడు. 

అయితే ప‌వ‌న్ గ‌దిలో పవన్ మృతదేహం ప‌డి ఉంది. మర్మాంగాల వద్ద తీవ్రంగా గాయాలుండటంతో, కుక్క కరిచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుక్క నోటిలో రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం, కుక్క మర్మాంగాలను గాయపరిచి ఉండడం వల్లే అతను మృతి చెందాడని భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే పవన్‌కు కొంతకాలం క్రితం వివాహం జరిగినప్పటికీ, భార్య విడాకులు ఇచ్చిన‌ట్లు సమాచారం. ప్రస్తుతం మృతుడి స్నేహితుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.