హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్లు.. ఈ సారి కొత్తగా..
హైదరాబాద్ లో మళ్లీ డబులు డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గత నెల ఓ వ్యక్తి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సర్వే చేశారు.
హైదరాబాద్ లో మళ్లీ డబులు డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గత నెల ఓ వ్యక్తి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సర్వే చేశారు.
ఈ సర్వేలో ప్రాథమికంగా డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను గుర్తించారు. ఈ మార్గాల్లో ముందు పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించడంతో డబుల్ డెక్కర్ బస్సులు ఆయా మార్గాల్లో తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఇందుకు వాటితో ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు.
నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహిదీపట్నం - సికింద్రాబాద్, మెహిదీపట్నం - చార్మినార్, సికింద్రాబాద్ - చార్మినార్, సికింద్రాబాద్ - జూపార్కు మార్గాల్లో నడిచాయి. అలాగే సికింద్రాబాద్, కోఠి నుంచి పటాన్చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. అందుకే నగరం నుంచి పటాన్చెరు వరకు మళ్లీ డబుల్ డెక్కర్ నడపాలని భావిస్తున్నారట.
అలాగే మేడ్చల్ రూట్లో సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ రూట్ లో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పే ఆలోచనలో ఉన్నారు.
దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు నడిచిన డిజైన్లోనే కొత్త బస్సులు కూడా రూపొందించాలని నిర్ణయించారు.