Hyderabad: SRH టీమ్ ఉన్న హోటల్లో అగ్నిప్రమాదం.. జట్టు పరిస్థితి ఏంటంటే

Synopsis
హైదరాబాద్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ హోటల్లో ఐపీఎల్ జట్టైన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు బస చేస్తున్నారు. బంజారహిల్స్లో ఉండే పార్క్ హయత్ హోటల్లో ఒక ఫ్లోర్లో మంటలు మొదలయ్యాయి. వెంటనే హోటల్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. జాగ్రత్త చర్యగా SRH ఆటగాళ్లను పార్క్ హయత్ నుంచి మరో సురక్షిత స్థలానికి తరలించారు. మంటలు ఎలా వ్యాపించాయన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే సన్రైజర్స్ జట్టు సభ్యులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి (DFO) ప్రకారం, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఆటగాళ్లు షెడ్యూల్ ప్రకారమే హోటల్ నుంచి సురక్షితంగా చెక్ఔట్ చేశారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. ఆటగాళ్లు తమ జట్టు బస్సులో హోటల్ నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాదానికి కారణమైన విషయాలపై అధికారులు ఇంకా పూర్తి నివేదికను విడుదల చేయలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతోన్న నేపథ్యంలో అగ్రి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో వేసవి ప్రారంభంలో అగ్ని ప్రమాద సంఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాణిజ్య, నివాస భవనాల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో మంటల ప్రమాదం ఎక్కువగా ఉండే నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.