పిల్లలకు హెల్తీ ఫుడ్స్ నే పెట్టాలి. కానీ ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలనే పెడుతున్నారు. దీనివల్ల పిల్లలు కూడా ఊబకాయం బారిన పడుతున్నారు.
ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న స్థూలకాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఊబకాయం గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్యేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1975 నుంచి ఊబకాయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. కూర్చొని పనిచేసే పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్టు కనుగొన్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాల వల్లే పిల్లల్లో స్థూలకాయం పెరుగుతుందట. పిల్లల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే.. వారి ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అసలు పిల్లలు ఎలాంటి ఫుడ్ ను తింటే ఊబకాయం బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్ట్ ఫుడ్
పిజ్జా ఇటాలియన్ వంటకం. దీన్ని హెల్తీ ఫుడ్ గా భావిస్తారు. కానీ ఇది త్వరగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బర్గర్లు, ప్యాటీస్ వంటి ఇతర ఫాస్ట్ ఫుడ్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. ఇది ఊబకాయంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
బంగాళాదుంప చిప్స్
బంగాళాదుంప చిప్స్ బలే టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని పిల్లలు ఎక్కువగా తింటారు. కానీ వీటిలో కేలరీలు, ఉప్పు, అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల బరువును అమాంతం పెంచేస్తాయి.
స్వీట్లు
క్యాండీలు, డెజర్ట్లు, చాక్లెట్లను పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి చాలా తీయగా ఉంటాయి. నిజానికి ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిని తింటే పిల్లల దంతాలు పుచ్చిపోతాయి. అలాగే ఊబకాయం బారిన పడతారు.
ఐస్ క్రీం
ముందే ఇది ఎండకాలం. ఈ సీజన్ లో ఐస్ క్రీం లను ఎక్కువగా తింటారు. ఇకపిల్లలైతే పూట పూటకు ఐస్ క్రీం కావాలంటారు. ఐస్ క్రీం మనల్ని చల్లగా ఉంచినప్పటికీ.. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఐస్ క్రీంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీ పిల్లల బరువును పెంచేస్తాయి. ఈ సీజన్ లో ఐస్ క్రీంను తినకుండా ఉండలేం అంటే ఇంట్లోనే తక్కువ చక్కెర, కేలరీలతో తయారు చేసి పెట్టండి.
నూడుల్స్
నూడుల్స్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. గోధుమ పిండితో తయారుచేసిన నూడుల్స్ ను తిన్నా పిల్లలు తొందరగా ఊబకాయం బారిన పడతారు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
పండ్ల రసం
పిల్లలకు బయట కొన్న పండ్ల రసాలను కూడా తాగించకూడదు. ముఖ్యంగా టెట్రా ప్యాక్ లలో వచ్చే పండ్ల రసం. ఎందుకంటే వీటిలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పండ్ల రసాలకు బదులుగా పండ్లను ఇవ్వండి. ఎందుకంటే పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. రకరకాల పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వండి. హెల్తీగా ఉంటారు.
