కరోనా కాదు.. గుండెపోటు వల్లే ఎక్కువ మరణాలు..!
కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల కారణంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య దాదాపు 13 శాతం పెరిగిందని ‘బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్’ వెల్లడించింది. లాక్డౌన్ సందర్భంగా పింఛనుదారుల మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఫౌండేషన్ అంచనా వేసింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు పలు దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ వల్ల కూడా చాలా మంది అవస్థలు పడి ప్రాణాలు కోల్పోయారని నిపుణులు చెబుతున్నారు.
లాక్ డౌన్ లో కనీస వైద్య సదుపాయాలు కూడా అందక బ్రిటన్ లో 65ఏళ్ల లోపు వృద్ధులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఓ సర్వేలో తేలింది. కరోనా సంగతి పక్కన పడపితే.. గుండెపోటు వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వారు చెప్పారు.
సాధారణ సమయాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్యకన్నా ఇది 420 ఎక్కువ. జూలై నెల వరకు 800 మంది వృద్ధులు ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. అంటే కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల కారణంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య దాదాపు 13 శాతం పెరిగిందని ‘బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్’ వెల్లడించింది. లాక్డౌన్ సందర్భంగా పింఛనుదారుల మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఫౌండేషన్ అంచనా వేసింది. సాధారణ పరిస్థితుల్లోకన్నా ఆంక్షల సమయంలో 976 మంది పింఛనుదారులు మరణించారని, సాధారణ సమయాల్లోకన్నా ఈ మరణాలు ఆరు శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
కరోనా మినహా వైద్య సేవలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించినట్లయితే భవిష్యత్లో గుండెపోటు మరణాలు, పింఛనుదారుల అకాల మృతి పెరగుతుందని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ సోన్యా బాబు–నారాయణ్ హెచ్చరించారు. గత మార్చి నెల నుంచి జూన్ వరకు నాలుగు నెలల కాలంలో ఆస్పత్రుల్లో సాధారణ అడ్మిషన్లు 1,73,000 తగ్గగా, లక్షా పదివేల మంది అనారోగ్యం వల్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్నున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు.