జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు మధ్య వున్న సాన్నిహిత్యానికి బినామీ వ్యవహారాలే కారణమంటూ వైసిపి నాయకులు సి రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని రోజులు కనుమరుగయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతాన్ని వీడి అజ్ఞానంతో మళ్ళీ బయటకు వచ్చాడని వైసీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీ అయిన పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పవన్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ రామచంద్రయ్య దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడని ఆరోపించారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టి ఏం చేశావని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే నిద్రపోయావా అని నిలదీశారు. 

ఇప్పుడు పవన్ కొత్తరాగం అందుకున్నారని... బీజేపీ చంక ఎక్కాలని చూస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో ఆయన స్థానం ఏంటో తేలిపోయిందని...అది తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 

read more అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం... తీర్మానాలివే

ఆయనకు ప్రజల్లో అభిమానం లేకే గత ఎన్నికల్లో ఓట్లు పడలేవన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం అటుంచితే స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో అతడే ఘోర పరాజయం చెందాడని... అలాంటి ఏకైక నాయకుడు పవనేనంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే అమిత్ షా లాంటి వారికయినా మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని... చంద్రబాబు సూచనలతో ఇదంతా జరుగుతోందన్నారు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ను పట్టుకుని అమర్యాదగా మాట్లాడున్నాడని... జగన్ రెడ్డి అంటూ సంబోధించడం అవహేళన చేయడమేనని అన్నారు. కులాలను అడ్డం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది ఎవరో అందరికి తెలుసన్నారు. 

read more పవన్=గాలిమాటలు, కళ్యాణం= పెళ్లి...: పవన్ పై అంబటి షాకింగ్ కామెంట్స్

కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేయాలని పవన్ చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కేవలం వైసీపీ పైనే ఆరోపణలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

 గతంలో పవన్ ట్వీట్లన్ని ఆంగ్లంలోనే పెట్టేవాడని... అప్పుడు తెలుగు అంతరించి పోయిందాఅని ప్రశ్నించారు. బాషా పండితులతో పవన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ప్రభుత్వానికి మేలే చేస్తుందన్నారు. 

రోజుకొక ముసుగు ధరించి మరీ విమర్శలు చేస్తున్నారని...రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలు అనడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేస్తే బాగుంటుందని సూచించారు. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు చూస్తే అవగాహన లోపంతో చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని రామచంద్రయ్య అన్నారు.