Asianet News TeluguAsianet News Telugu

గిరిజన ప్రాంతాల అభివృద్దికి రూ.130కోట్లు.... గర్భిణులకు భరోసా: పుష్పశ్రీవాణి

గిరిజన ప్రాంతాల అభివృద్ది, మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాల ప్రజలకు సరయిన వైద్య సదుపాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పుష్నశ్రీవాణి తెలిపారు.  

YSRCP government committed to tribal welfare:Pushpa Srivani
Author
Amaravathi, First Published Jan 10, 2020, 5:44 PM IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ఏరియాలో రహదారుల ఏర్పాటుకు, అదనపు భవనాల  నిర్మాణానికి రూ. 130.46 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ప్రధానంగా ఇప్పటి వరకూ రహదారులు లేక అత్యవసర వేళల్లో రోగులను తరలించడానికి డోలీలపై ఆధారపడుతున్న గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్డు పనులను మంజూరు చేసామని తెలిపారు.

రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటుగా గిరిజన విద్యా సంస్థలు, కార్యాలయాలకు అవసరమైన అదనపు భవన నిర్మాణపనులకు ఈ నిధులను మంజూరు చేసామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పుష్ప శ్రీవాణి తెలిపారు. 

read more  రాజధాని కోసం జోలెపట్టిన చంద్రబాబు... రూ.50 కోట్ల సేకరణ: కన్నబాబు

వివిధ ఐటీడీఏల పరిధిలో ఉన్న అనేక గిరిజన ఆవాసాలకు తరతరాలుగా రహదారి సౌకర్యాలు లేకపోవడంతో అత్యవసర వేళల్లో ఆంబులెన్స్ లు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగానే రహదారులు లేని గిరిశిఖర గ్రామాల నుంచి గిరిజనులు రోగులను, బాలింతలను డోలీలలో మోసుకురావాల్సిన పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు. 

అలాంటి పరిస్థితుల్లో ఉన్న గిరిశిఖర గ్రామాలకు ముందుగా రోడ్ ఫార్మేషన్ పనులు పూర్తి చేస్తే వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు ఐటీడీఏల పరిధిలో 236 రోడ్ ఫార్మేషన్ పనుల కోసం రూ.23.50 కోట్లను మంజూరు చేసామని వివరించారు.  ఇది కాకుండా ప్రధాన రహదారుల నుంచి గిరిజన గ్రామాలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 మట్టి రోడ్ల స్థానంలో తారు (బీటీ) రోడ్ల నిర్మాణాన్ని కూడా మంజూరు చేసామని దీని కోసం రూ. 61.04 కోట్లను కేటాయించామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

read more  అమరావతి మహిళలపై పోలీసుల దాడి... జాతీయ మహిళా కమీషన్ సీరియస్

 గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విద్యా సంస్థలు, కార్యాలయ భవనాలలో అదనపు గదులను నిర్మించడానికి, అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు ఐటీడీఏల పరిధిలో  57 భవనాలు, ఇతర సౌకర్యాల కల్పన కోసం రూ. 45.90 కోట్లను మంజూరు చేసామని చెప్పారు. ఆరు ఐటీడీఏల పరిధిలో 236 రోడ్ ఫార్మేషన్ పనులు, 20 తారు రోడ్లు, 57 భవనాల నిర్మాణానికి 130.46 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగిందని పుష్ప శ్రీవాణి వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios