Asianet News TeluguAsianet News Telugu

మారేది ముఖ్యమంత్రే, రాజధాని కాదు... చంద్రబాబు నిర్ణయాన్నీ వ్యతిరేకించా..: మాజీ మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం అమరావతి నుండి వేరే ప్రాంతాలకు రాజధానిని తరలించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు వ్యతిరేకించారు. రాష్ట్రానికి సీఎంలు మారతారు కానీ రాజధాని కాదన్నారు. 

vadde shobhanadishwar rao reacts on AP  government three capitals decision
Author
Amaravathi, First Published Feb 3, 2020, 3:03 PM IST

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరావు మద్దతు తెలిపారు. ఓ రైతు బిడ్డగా తనకు అన్నధాతల కష్టాలు తెలసు కాబట్టే 77 ఏళ్ల వయస్సులో కూడా వారికోసం కదిలినట్లు తెలిపారు. గతంలో తాను ఢిల్లీలో జరిగిన కిసాన్ మేళాలో కూడా పాల్గొన్నానని అయితే మహిళలు ఇన్ని రోజులు పోరాడటం తాను ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. 

నూటికి నూరు శాతం రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు కొద్దిగా పాలసీలు మాత్రమే మారతాయి కానీ రాజధానులు మారిని దాఖలాలు ఎక్కడా లేవన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మారతారు కానీ రాజధానులు మారవన్నారు. 

గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్లే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగిందన్నారు. అందువల్లే ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉందన్నారు. పాలన మారినా అక్కడ అభివృద్ధి తగ్గలేదన్నారు. 

ఎవరికో పేరు వస్తుంది అని పనులు ఆపకూడదని ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రెయింబర్స్ మెంట్ వంటివి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తీసి వెయ్యలేదని...వాటిని అలాగే కొనసాగించారని గుర్తుచేశారు. కేవలం ఒక్క వ్యక్తి మీద కోపముతో అభివృద్ధిని అడ్డుకోకూడదని సూచించారు. 

మూడు రాజధానుల దిశగా... మరో కీలక ముందడుగు వేసిన జగన్ ప్రభుత్వం

సీఎం జగన్ తీసుకున్న మూడు రాజదానుల నిర్ణయం చెల్లదని మాజీ మంత్రి పేర్కొన్నారు. తాను 'లా' చదవలేదు అయినా కొన్ని చట్టాలు తెలుసన్నారు. ఆర్టికల్ 245 అనే ఒక చట్టం ఉందని... అది . పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు మాత్రమే చెల్లుతాయని చెబుతోందన్నారు. 

రాష్ట్ర విభజనలో భాగంగా సెక్షన్ 5 లో ఆంద్రప్రదేశ్ కు ఒక నూతన రాజధాని ఏర్పాటు చెయ్యవలసి ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. సెక్షన్ 6లో ఒక రిఫర్ కమిటీ ద్వారా విభాజ్య ఆంధ్ర  ప్రదేశ్ లో రాజధాని ఎక్కడ పెట్టాలన్నది నిర్ణయించాలని వుందన్నారు.

విభజన సమయంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా సర్వే చేసి గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటుకు ప్రజా అభిప్రాయం ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి ఏర్పాటుకు ఒప్పుకున్నారని అన్నారు.  

ముఖ్యమంత్రి జగన్  తన విలాసాల కోసం బెంగుళూరులో నాలుగు ఎకరాల్లో ఫ్యాలస్ కట్టుకున్నాడని అన్నారు. అలాగే హైదరాబాద్ లో లోటస్ పాండ్ పేరుతో లంకంత కొంప ఎందుకు కట్టాడని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ ఇంటికి 14 లిఫ్టులు ఉన్నాయో లేవో తెలియదు కానీ హైదరాబాద్ లోని జగన్ ఇంట్లో మాత్రం 14 లిఫ్ట్ లు ఉన్నాయన్నారు. ఇవన్నీ చాలవన్నట్లు తాడేపల్లిలో మరో ఇల్లు ఎందుకు కట్టుకున్నావ్ అని ప్రశ్నించారు. 

read more  రంగంలోకి ఈడీ: అమరావతి భూముల కొనుగోలు‌పై కేసు

భారత రాజ్యాంగంలో రాజధాని గురించి లేదని జగన్ అంటున్నారని... దీన్ని బట్టే ఆయన తుగ్లక్ సీఎం అని అర్థమవుతుందన్నారు. రాష్ట్రానికి ఒక్కటే హైకోర్ట్ ఉండాలని...అక్కడో బెంచ్ ఇక్కడో బెంచ్ అని ఇష్టమొచ్చినట్లు పెడతానంటే కుదరదని హెచ్చరించారు. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే హైకోర్టు మార్పు కుదురుతుందన్నారు. 

గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సపాదించిన డబ్బుతో ఇవాళ సీఎం జగన్ విశాఖలో భూములు కొన్నాడన్నారు. సీఎంతో పాటు రాజ గురువులు కూడా విశాఖలో ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయో అని తిరుగుతూ వున్నారన్నారు. 

అమరావతి రైతులందరికీ కోర్ట్ తప్పకుండా న్యాయం చేస్తుందని అన్నారు. ఆడవాళ్లు నడుం కట్టుకొని ఇలా దీక్షలు చేయడం ఆశ్చర్యపరిచే విషయంగా పేర్కొన్నారు. 
 రాజధాని కోసం ఇంత భూమి వద్దని ఏర్పాటు చేసే తరుణంలోనే అప్పటి సీఎం చంద్రబాబుకు చెప్పానని అన్నారు. జరీబు భూములు మినహాయించమని కోరానని...  ఇప్పటికి అదే చెప్తున్నాను రాజధానికి ఇంత భూమి అవసరం లేదు అని పేర్కొన్నారు. ఈ విషయం రైతు బిడ్డగానే కాదు కొన్ని పోరాటాలు చేసిన వ్యక్తిగా చెప్తున్నానని అన్నారు. 

రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికి అప్పుడు ఇంటిలజన్స్ తెలుపుతూ ఉందన్నారు. ఇక్కడి దుందుడుకు నిర్ణయాన్ని కేంద్రం తప్పకుండా అడ్డుకుంటుందని మాజీ మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో దుందుడుకు నిర్ణయాలను మెడలు వంచే సత్తా కేంద్రానికి ఉందన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానాన్ని చైనా కంపెనీకి ముట్ట జెప్పాలని ప్రభుత్వం చూసిందన్నారు. వైసీపీ మంత్రులు పాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీలో పెట్టిన బిల్లులో  గవర్నర్ బంగ్లా,సెక్రటేరియట్, అన్ని విశాఖ తరలించేలా క్షుణ్ణంగా రాశారని.... అది పాలన వికేంద్రీకరణ కాదు పాలన కేంద్రీకరణ అవుతుందని వడ్డే శోభనాదీశ్వరావు పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios