Asianet News TeluguAsianet News Telugu

సోనియా గాంధీ, జగన్ పుట్టినరోజులకు పోలిక...ఏపికి అన్యాయమే: చినరాజప్ప

ఆనాడు సోనియాగాంధి తన పుట్టినరోజు కానుకగా రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేస్తే ప్రస్తుతం జగన్ తన పుట్టినరోజు కానుకగా రాజధానిని విభజించి మరోసారి అన్యాయం చేస్తున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.  

nimmakala chinarajappa comments on  ap capital issue
Author
Guntur, First Published Dec 21, 2019, 9:36 PM IST

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైనప్పటినుండి తన మంత్రులచే రాజధాని విషయంలో భిన్నమైన ప్రకటనలు చేయించి వ్యతిరేక దోరణినే అవలంభించారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మొదటినుండి అమరావతిపై ఆయన వైఖరి అదేనని... కానీ ఇప్పుడు భయపటపడ్డాడని అన్నారు. 

జగన్ బ్యాచ్ ముందుగానే విశాఖపట్నంలో భూములను కబ్జా చేసి ఇప్పుడు రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రానికి వరల్డ్ క్లాస్ రాజధానిని అందించడానికి కృషి చేస్తే దానిని జగన్ విచ్ఛిన్నం చేశారన్నారు. 

ఆనాడు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే...నేడు జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజధానిని మూడు ముక్కలు చేశారన్నారు.మంత్రులు ఒకచోట, సెక్రటేరియట్ మరోచోట, హైకోర్ట్ ఇంకోచోట ఏర్పాటు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు.  

read more  కర్నూల్ మాత్రమే ఓకే... విశాఖ, అమరావతి కాదు: అఖిలప్రియ

జీఎన్ రావు కమిటీని నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాలకు చెందిన సామాన్యులు, రైతులే కాదు మహిళలు కూడా నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా మందడం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు దగ్దం చేసి తమ ఆందోళనలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలను దగ్థం చేశారు.

 మూడు రోజులుగా అమరావతి సమీపంలో మందడం, వెలగపూడి, తుళ్ళూరు తో పాటు పలు గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తున్నారు. మందడం వద్ద సీడీ యాక్సెస్ రోడ్డు నుండి సచివాలయం రోడ్డును రైతులు బ్లాక్ చేశారు. రోడ్డుపై అడ్డంగా సిమెంట్ బెంచీలు వేశారు. రోడ్డుపై వాహనాలను అడ్డంగా నిలిపారు.

రోడ్లపైనే టైర్లను దగ్ధం చేశారు.  జీఎన్ రావు కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

read more తుళ్లూరు పంచాయితీకి నల్లరంగు... నాన్ బెయిల బుల్ అరెస్టులే

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికనపు పరిగణనలోకి తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ 29 గ్రామాల ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు..

 వివిధ రూపాల్లో స్థానికులు, రైతులు ఆందోళనలకు దిగారు. వెలగపూడిలో రైతులు మూడో రోజు దీక్షలు చేస్తున్నారు. వెలగపూడి గ్రామపంచాయితీ కార్యాలయానికి వైసీపీ రంగులను రైతులు తుడిచివేసే ప్రయత్నం చేశారు.గ్రామ పంచాయితీ కార్యాలయానికి రంగు వేస్తున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు రైతులు గ్రామపంచాయితీ కార్యాలయానికి నల్లరంగు పూయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో వెలగపూడి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు  దున్నపోతుతో రైతులు, స్థానికులు మందడంలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని స్థానికులు విమర్శలు గుప్పించారు.


 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios