గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొటప్పకొండలో శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుని ఇద్దరు  భక్తులు మృత్యువాతపడ్డారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో శివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ప్రభలను అలంకరించి తీసుకెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఎడ్లపాడు మండల పరిధిలో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామస్తులు ప్రత్యేకంగా ప్రభలను అలంకరించి ఎడ్లబండిపై కోటప్పకొండకు బయలుదేరారు. అయితే వీరి బండ్లు ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్దకు చేరుకోగానే వెనకవైపు నుండి మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో నిమ్మగడ్డ కోటేశ్వరరావు, శివాజీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

read more హైదరాబాద్ లో విషాదం... కొడుకు ఉద్యోగం కోసం తల్లి ఆత్మహత్య

ఈప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు సమాచారం. 

తమవారు దైవదర్శనం కోసం వెళుతూ ఇలా ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాల్సిన ఆ రైతుల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా పెద్దగొట్టిపాడు గ్రామంమొత్తం బాధలో మునిగిపోయింది.