Asianet News TeluguAsianet News Telugu

హైపవర్ కమిటీ సమావేశం...రాజధానిపై చర్చించిన అంశాలివే

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ సోమవారం సమావేశమై కీలక అంశాలపై చర్చించింది.  మరోసారి రాజధాని అంంశంపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు మంత్రులు తెలిపారు.  

High Power Committee decision on AP Capital
Author
Guntur, First Published Jan 13, 2020, 7:10 PM IST

అమరావతి: రాజధాని కోసం ఏర్పాటయిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికను అధ్యయనం చేసి తుది నివేదికను తయారుచేయడానికి ప్రభుత్వం మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగానే రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఈ హైపవర్ కమిటీ నివేదిక కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. ఈ  క్రమంలో ఇప్పటికే పలుమార్లు సమావేశమైన హైపవర్ కమిటీ సభ్యులు మరోసారి సోమవారం సమావేశమై వివధ అంశాలపై చర్చించారు. 

ఈ  సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రులు మీడియాకు వివరించారు. మొదట పేర్నివెంకట్రామయ్య (నాని)  మాట్లాడుతూ... జిల్లాల వారీగా అభివృద్ధి అంశాలను చర్చించినట్లు తెలిపారు. మరోసారి 17వ తేదీన భేటీ అవుతున్నామని... అందులో తుది నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. 

రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంకు ఏం చెప్పదలుచుకున్నా సిఆర్డీఎ కమిషనర్ కు ఈనెల 17వ తేదీ సాయంత్రం లోగా తెలియజేయవచ్చన్నారు. లిఖిత పూర్వకంగా లేదా ఈ మెయిల్ ద్వారా కూడా తమ అభిప్రాయాలు పంపవచ్చని పేర్కొన్నారు.  

రాజధానిలోని 29 గ్రామాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుని లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందని మహిళలను ముందుకు తీసుకువచ్చి ఆందోళనలు చేయిస్తున్నాడని... ఇలా రాజకీయంగా ప్రేరేపితం చేసే ఉద్యమాలతో చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నాడని అన్నారు.  

read more  ఎన్టీఆర్ కు చంద్రబాబు సవాల్... భువనేశ్వరి కోసమే: దాడి వీరభద్రరావు

పోలీసులను రెచ్చగొట్టేలా ధర్నాలు చేయిస్తున్నాడని... ఈ ప్రేరేపిత ఆందోళనల వెనుక కుట్ర దాగుందన్నారు. హైపవర్ కమిటీ భేటీలో ప్రతిసారీ  రైతుల గురించి చర్చ జరుగుతోందన్నారు. ప్రభుత్వం రాజధాని విషయంలో ఏం చేయదలుచుకుందో ఈ 29 గ్రామాల రైతాంగానికి అర్ధం అవుతోందని.... ఇప్పటికే పలువురు రైతులు మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. 29 గ్రామాలకు చెందిన రైతులు మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారని... టిడిపి వైపు నుంచి తమపై దాడులు జరుగుతాయని భయాందోళనలకు గురవుతున్నట్లుగా చెబుతున్నారని  అన్నారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ... చంద్రబాబు బాధపడితే ప్రపంచం బాధపడి ఆయన ఆనందంగా వుంటేనే అందరూ ఆనందంగా పండుగ చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ రాజకీయ లబ్ది కోసం అమరావతి ప్రాంతం లోని రైతులను అయోమయంకు గురి చేశాడని... అర్ధంలేని కృత్రిమ‌ ఉద్యమాన్ని సృష్టించాడని మండిపడ్డారు.

కనీసం పండుగ పూట అయినా రైతులను సంతోషంగా వుండకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వమని... రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని... అంతులో భాగంగానే రాష్ట్ర డీజీపీపై అనుచిత విమర్శలు చేశాడున్నారు. 

డీజీపీపై ప్రాంతీయ విమర్శలు ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరించవద్దని చంద్రబాబుకు చెబుతున్నానని అన్నారు. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం వున్న వ్యక్తి ఇలా మాట్లాడతారా?  అని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టిడిపి అధినేత చంద్రబాబు ముష్టి ఎత్తుకునే స్థితికి దిగజారాడన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి జోలెపట్టి ముష్టి అడుక్కుంటూ కొత్త బిచ్చగాడిలా మారిపోయాడన్నారు. సంక్రాంతికి ఇళ్ళముందు అడుక్కునేందుకు వచ్చే పగటి వేషగాడిలా తయారయ్యాడని మండిపడ్డాడు.

గతంలో సీఎంగా వుండి అహంభావంతో తాట తీస్తాను, అట్టడుగు, బడుగువర్గాలు సెక్రటేరియట్ రావద్దంటూ చంద్రబాబు మాట్లాడారని....ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం రైతులను రెచ్చగొట్టి ఉద్యమం అంటూ తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు నైజంను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

read more  ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు...చెన్నై ఐఐటీ వ్యతిరేకం: ఎమ్మెల్యే ధర్మశ్రీ

ఇవాళ జరిగిన హైపర్ కమిటీ భేటీలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం పెరిగిపోయిందని...రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రాంతాల మధ్య అసమానతలు మరోసారి బయటపడ్డాయని అన్నారు. 

ఇటువంటి పరిస్థితి మరోసారి రాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఈ సమావేశం లో చర్చించినట్లు వెల్లడించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అంటే 29 రాజధాని గ్రామాలు మాత్రమే కాదని ఈ రెండు జిల్లాల్లో 3 వేల గ్రామాలు వున్నాయని అన్నారు. సీఅర్డీఎ పరిధిలోకి మచిలీపట్నం పార్లమెంట్ ను తీసుకురావడం వల్ల ఏడు నియోజకవర్గాల్లో 
అనేక సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లో సీఆర్‌డీఏ నుంచి ఈ 7 నియోజకవర్గాంలను తొలగించాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

బందరు పోర్ట్ నిర్మాణంకు రూ. 4500 కోట్లతో పనులు వెంటనే ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రాంతవాసిగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఆక్వా, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని కోరానన్నారు. దేశం మొత్తానికి ఇక్కడి నుంచి వున్న రహదారులు, రైల్వే కనెక్టివిటీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కమిటీకి సూచించినట్లు కొడాలి నాని వెల్లడించారు.

రాజధాని అమరావతి ద్వారా 29 గ్రామాల ప్రజల భూములకు అనూహ్యంగా రేట్లు పెరుగుతాయని చంద్రబాబు నమ్మించాడని....ఆ గ్రాఫిక్స్ చూసి రైతులు కూడా మోసపోయారన్నారు. నిజంగా అమరావతి నిర్మాణం చేసే పరిస్థితి వుందా అని ఆలోచన చేయకుండా రైతులను చంద్రబాబు మభ్యపెట్టాడన్నారు. ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజధాని జెఎసి పేరుతో ఉద్యమం ప్రారంభించాడని  ఆరోపించారు. 

చంద్రబాబు నేను ఏం చేసిన, చెప్పినా జనం నమ్ముతారాని అనుకుంటున్నాడని...రాజధాని అంటే కేవలం అమరావతి అని గతంలో అన్నాడని ఇప్పుడు మందడం, తుళ్ళూరు, వెంకటాయపాలెం అంటూ 29 గ్రామాలును ప్రస్తావిస్తున్నాడని అన్నారు. ఈ ప్రాంతంలోని ఏ ఒక్క రైతు నష్ట పోకూడదన్నారు. రైతులు తమ అభ్యంతరాలను సీఆర్‌డీఏ కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కాజా నుంచి గొల్లపూడి మీదిగా అవుటర్ రింగ్ రోడ్ కు ఈ జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయని నాని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios