ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి తప్పుబట్టారు. తనదైన స్టైల్లో జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సెటైర్లు విసిరారు.  

అమరావతి: రాజధాని కోసం అమరావతి రైతులు చేపడుతున్న ఆందోళనకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. మందడంలో రైతులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గతంలో టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తామంటే అనాటి ప్రతిపక్షనేత జగన్ మద్దతు తెలిపారన్నారు. దీంతో అధికారంలోకి వచ్చినా జగన్ రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తారన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు వైసిపిని గెలిపించారని అన్నారు. ఇలా చేస్తారని తెలుసుంటే ప్రజల నిర్ణయం మరోలా వుండేదన్నారు. 

రాజధానిని మారుస్తున్నానని ఎన్నికల్లో చెప్పి గెలిస్తే అప్పుడు జగన్ ఎక్కడికైనా మార్చవచ్చని అన్నారు. కాబట్టి జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని నారాయణ సూచించారు. అప్పుడు కూడా ఇదే ఫలితం వస్తే నిరభ్యంతరంగా రాజధానిని మార్చుకోవచ్చని... కానీ ఇప్పుడలా చేయడానికి కుదరదని అన్నారు. 

read more అమరావతిలో ఉద్రిక్తత... మీడియా, పోలీసులపై దాడి వారిపనే...: ఐజి వినీత్ బ్రిజల్

ఇప్పుడున్న ఏపి రాజధాని అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందన్నారు. అందరూ అమరావతిని రాజధానిగా అంగీకరించారని అన్నారు. కానీ తాజాగా వైసిపి ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి నగర ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశముందన్నారు. 

దివంగల మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కంటే జగన్ మెరుగ్గా పాలిస్తాడనుకుంటే అంతకంటే దారుణంగా పాలిస్తున్నాడని అన్నారు. పెళ్లాన్ని ఒకచోట, మెగుడిని మరోచోట పెట్టి సంసారం సుఖంగా సాగాలనుకుంటే ఎలాగంటూ మూడు రాజధానుల నిర్ణయంపై నారాయణ సైటైర్లు విసిరారు. 

read more ఆ నిర్ణయానికి స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం: స్పీకర్ తమ్మినేని

గత ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తిరిగిన చోట తాను తిరగకూడదని జగన్ భావిస్తున్నట్లుగా ఉందన్నారు. కేవలం అందుకోసమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టడం ఏమీ బాగోలేదని.... రాజధానిని అమరావతి నుండి మారిస్తే ఒప్పుకోబోమని సిపిఐ నేత నారాయణ హెచ్చరించారు.