ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంపై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. 

అమరావతి: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయం నుండి కొన్ని కార్యాలయాలు కర్నూల్ కు తరలించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా దీనిపై ఇవాళ విచారణ జరిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషనర్లకు హై కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్ చేయడం సరికాదనని సూచించింది. అలాగే ఏ కారణాలతో ఆఫీసులను తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. 

read more పంచాయతీ ఆఫీసులపై జగన్ బొమ్మ: మండిపడిన హైకోర్టు

ఇదే విషయంపై ఇదివరకు జరిగిన విచారణలో న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. పిటిషన్లు తమ వద్ద పెండింగులో ఉండగా కార్యాలయాలను ఎలా ఇతర ప్రాంతాలకు తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

దీంతో మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కార్యాలయాల తరలింపుపై కారుమంచి ఇంద్రనీల్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.