Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో కరోనా కలకలం... నెల్లూరులో పాజిటివ్... మరో ఐదుగురికి అనుమానం

ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య  శాఖ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కేవలం ఒకేఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలిపింది. 

AP Health Department Released bulletin Over Corona
Author
Amaravathi, First Published Mar 13, 2020, 11:03 AM IST

అమరావతి:  ప్రంపంచాన్ని వణికిస్తున్న కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కేవలం ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఒక కొవిడ్ -19 పాజిటివ్ కేసు నమోదయినట్లు పేర్కొంది. ఈ వైరస్ బారినపడిన వ్యక్తి ఆరోగ్యం స్థిమితంగానే వున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించరు. 

ప్రస్తుతం వ్యాధి లక్షణాలనుండి అతడు తేరుకున్నాడని... అయితే 14 రోజులవరకు తమ పర్యవేక్షణలో వుంచుకున్న తర్వాత అప్పుడు మరోసారి శాంపిల్ ను తిరిగి పరీక్షించనున్నట్లు తెలిపారు. అప్పుడు కూడా నెగెటివ్ అని తేలితే డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా లక్షణాలను కలిగిన మిగతా ఐదుగురిని కూడా 14 రోజులపాటు ఆసుపత్రిలో ఉంచుతామన్నారు. వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆస్పత్రిలో వుంచుతున్నట్లు తెలిపారు.

కొవిడ్-19 విషయంలో ఆందోళన చెందొద్దని... వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని జవహర్ రెడ్డి  ప్రజలకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తిని మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించామన్నారు. పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచామన్నారు.

read more ఏపీలో మరో రెండు కరోనా కేసులు..? అనకాపల్లిలో కలకలం

 కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు 0866-2410978 కి తెలియజేయాలని సూచించారు. కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని... లేదంటే  వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని  సూచించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి 666 మంది ప్రయాణికులు రాష్ట్రానికొచ్చారని... వారిలో ఇప్పటికే 561 మంది వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 319 మంది సొంత ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  9 మంది ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 52 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 47 మందికి నెగటివ్ అని తేలిందన్నారు. 
నలుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని... మరో 195 మంది ప్రయాణికులు ట్రేస్ కావాల్సి ఉందన్నారు. 

కొవిడ్ -19 నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జవహర్ రెడ్డి తెలిపారు. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టామని... విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో  స్క్రీనింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో 8386 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేయగా... 64 మందికి వ్యాధి లక్షణాలున్నట్లు బయటపడిందన్నారు. వైజాగ్/గన్నవరం ఓడరేవులో 1088 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని...వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని అన్నారు. 

విశాఖ ఎయిర్ పోర్టులో కరోనా లక్షణాలున్న వ్యక్తి..ఏం చేశాడంటే...

కృష్ణపట్నం ఓడరేవులో 599 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేయగా వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవన్నారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులు ఖచ్చితంగా 28 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని... వ్యాధి లక్షణాలున్నా లేకపోయినా బయటకు రాకూడదని సూచించారు. కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ సన్నిహితంగా వుండకూడదని... వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ ను ధరించి సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని సూచించారు. 

వ్యాధి లక్షణాలుంటే సొంత వాహనాలు, ప్రజారవాణ వాహనాల్లో కాకుండా 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి సూచించారు.  జిల్లాల్లోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని...కొవిడ్-19 అనుమానిత కేసుల విషయంలో జిల్లా వైద్యాధికారులు, రేపిడ్ రెస్పాన్స్ టీంలు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని జవహర్ రెడ్డి
 ఆదేశించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios