Asianet News TeluguAsianet News Telugu

వైన్స్ లు, బార్లు తగ్గించి వాటిని పెంచుతున్నాం... అయినా విమర్శలే: జగన్

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖకు సంబంధించి ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణలపై సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. 

ap cm ys  jagan review meeting on education department
Author
Amaravathi, First Published Dec 27, 2019, 7:52 PM IST

అమరావతి: ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష  చేపట్టారు. ప్రజలు  వైసిపి ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారని... అందులో ముఖ్యమైనది నాణ్యమైన విద్య అని సీఎం సంబంధిత అధికారులకు తెలిపారు. పాఠ్యప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరిని విద్యను అందుబాటులోకి తేవాలంటే ఫీజులు చాలా తగ్గించాల్సిన అవసరం వుందన్నారు. ఈ మూడు విషయాల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించాలని జగన్ ఆదేశించారు. 

విద్యా హక్కు చట్టాన్ని కూడా పక్కాగా అమలు చేయాలని..  ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. స్కూలు ఫీజులు సాధారణ స్థాయిలో  లేవన్నారు. తల్లిదండ్రులకు షాక్‌ కొట్టే రీతిలో ఫీజులున్నాయని... ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో ఉన్నందువల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే వారు చదువులమీద బోలేడు ఖర్చుచేస్తున్నారని అన్నారు. 

ఇంగ్లిషు మీడియం చదువులు కోసం ప్రతి విద్యార్ధిమీద విపరీతంగా ఖర్చుపెడుతున్నారని సీఎం పేర్కొన్నారు. పిల్లలకు మనం ఇంగ్లిషు మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు విపరీతంగా  చేస్తున్నారని...ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయాలేనని సీఎం అధికారులతో అన్నారు. 

ఇంగ్లిషు మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. మరోవైపు మనం స్కూలు ఫీజులను తగ్గించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే ఫోకస్‌ ఎక్కడపెట్టాలో సులభంగా తెలుస్తుందన్నారు. 

read more  పెళ్లాం ఓ చోట, మొగుడు మరో చోట...జగన్ నిర్ణయంపై నారాయణ సెటైర్లు

ప్రభుత్వానికి మంచి పేరే వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారని  సీఎం మండిపడ్డారు.మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే... దానిపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిషు మీడియంలో చదువులు చెప్పిస్తున్నామంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారని... ఇలా విమర్శలు చేసేవారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు అని ప్రశ్నించారు. 

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లలో ఫీజుల షాక్‌ను నియంత్రించేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమాజం పట్ల అంకిత భావంలేకుండా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయన్న సందేశం పోవాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలన్నారు.

బీదల పిల్లలు మంచి కాలేజీల్లో చదువుకోవాలని... ఈమేరకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఖచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాల్సిన డబ్బులను సకాలంలో ఇస్తామని... కానీ ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం అధికారులకు గట్టిగా చెప్పారు. 

ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటే వాటిని ప్రచారం చేయాలని... దీనివల్ల ఇతరులు ఆ తప్పులు చేయకుండా ఉంటారన్నారు. ప్రి ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై దృష్టిపెట్టాలన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. 

read more  ముగిసిన ఏపి కేబినెట్ భేటీ...కీలక నిర్ణయాలివే

అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలోనే నిర్వహించాలని సూచించారు. ఆరోజు తల్లిదండ్రులతో ఏర్పడ్డ విద్యా కమిటీలను పిలిపించి ఘనంగా అమ్మ ఒడిని నిర్వహించాలన్న ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మరియు మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మరియు మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios