రాజధానిగా  అమరావతిని కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమ సెగ తాజాగా విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద  సరస్వతికి తాకింది. 

గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నంద సరస్వతికి అమరావతి మహిళల సెగ తగిలింది. ఓ ఆద్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరుకు విచ్చేసిన స్వామీజీని రాజధాని ప్రజలు అడ్డుకున్నారు. అమరావతి మద్దతుగా నినాదాలు చేస్తూ రాజధానిని మార్చకూడదని ఏపి ముఖ్యమంత్రి జగన్ కు చెప్పాలని... ఇలా తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శుక్రవారం స్వరూపానంద సరస్వతి గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే ఓ ఆద్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. ఇందుకోసం ఆయన ఉదయమే అక్కడికి చేరుకోగా అప్పటికే అక్కడ గుమిగూడిన కొందరు మహిళలు, పురుషులు స్వామీజిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నారు.

జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన వారిని వైసిపి నాయకులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి గందరగోళంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్వామీజీని అక్కడినుండి సురక్షితంగా బయటకు తీసుకెళ్ళారు. 

సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం వెనుక స్వరూపానంద స్వామి ప్రమేయం వుందని టిడిపి ఆరోపిస్తోంది. స్వామిజీ సూచన మేరకే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని పలువురు టిడిపి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరుకు విచ్చేసిన స్వరూపానంద రాజధాని మహిళల నిరసనకు గురవ్వాల్సి వచ్చింది. 

read more ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: రాజ్యసభలో కనకమేడల

ఇదివరకే గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రైతులు వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకుని ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు బైఠాయించిన ఆందోళనకారులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి ఘటనలో తాజాగా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయానికి వెళ్తున్న సీఎం జగన్ కి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. 

read more నారాయణ, పత్తిపాటిలపై కేసు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండో రోజూ సోదాలు