ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం  తెలిసిందే. ఆదివారమైన ఇవాళ తెల్లవారుజాము నుండే నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు, విజయవాడ జిల్లాల ప్రజలు, రైతులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అమరావతి విషయంతో స్ఫష్టమైన హామీ వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కూడా వివిధ రకాల పద్దతుల్లో తమ నిరసనను తెలియజేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజధాని రైతులు ఉదయం 8:30కి ఉద్దండరాయిని పాలెంలో రాజధానికి ప్రదాని మోదీ శంకుస్థాపన ప్రదేశంలో వంటావార్పు చేపట్టారు. అలాగే తుళ్లూరు,మందడం, రాయపూడి, పెద్దపరిమి గ్రామాల్లోని రైతులు, ప్రజలు మహా ధర్నా కు దిగారు. 

వెలగపూడి లో 5వ రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. ఇలా అమరావతి కోసం భూములను త్యాగం చేసిన 29గ్రామాల ప్రజలు నిరసనలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, నాయకులు వీరి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.

 అమరావతిలోనే రాజధాని వుండాలని... వేరే ప్రాంతాలతో కలిసి రాజధానిని పంచుకోబోమని ఆ ప్రాంత ప్రజలు, రైతులు నిరసన జరుపుతున్న ఉద్యమానికి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జేఏసి ఏర్పడింది. ప్రజా నిరసనలను ఉద్యమరూపంగా మలిచి ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ప్రజాసంఘాలు కలిసి అమరావతి పరిరక్షణ సమితి జెఏసి(జాయింట్ యాక్షన్ కమిటీ)గా ఏర్పడ్డాయి. 

read more కర్నూల్ మాత్రమే ఓకే... విశాఖ, అమరావతి కాదు: అఖిలప్రియ

విజయవాడలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆదర్యంలో వివిధ సంఘాలు సమావేశమయ్యాయి. రాజధాని మార్పు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జెఏసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోగతికి కారణం అయ్యే సంఘాలన్నింటికి కలుపుకుని జెఏసి గా ఏర్పడినట్లు తెలిపారు. 

జియన్ రావ్ కమిటి నివేదిక అందకముందే ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐదేళ్ళుగా తప్పుగా అనిపించలేదు కానీ అధికారంలోకి రాగానే తప్పుగా కనిపించిందా... ఇది మంచి పద్దతి కాదన్నారు. 

అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిందేనని... కానీ ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని బలిచేయవద్దన్నారు. ‌విధాన పరమైన నిర్ణయాలు తప్పుగా ఉంటే సరి చేసుకోవాలిగానీ ఇలా రాజధానినే మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఎవరు స్వాగతించరన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ జిల్లావాసులతో కలిసి తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

ఆంద్రప్రదేశ్ భౌగోళికంగా చాల దూరం విస్తరించి ఉందని... కర్నూలు, శ్రీకాకుళం మధ్య రాకపోకలు సాగించాలంటే కష్టసాద్యమన్నారు. పరిపాలన సౌలభ్యం అంటే ఉధ్యోగులను, అధికారులను ఇబ్బంది పెట్టడమేనా... అప్పుడు హైదరాబాదు నుండి విజయవాడకు, ఇప్పుడు విజయవాడ నుండి వైజాగ్ కు అని తరలించడమేనా అని ప్రశ్నించారు.

read more సోనియా గాంధీ, జగన్ పుట్టినరోజులకు పోలిక...ఏపికి అన్యాయమే: చినరాజప్ప

ప్రస్తుతం రాజధానిపై తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజలను అయోమయంలోకి నెట్టారన్నారు. ప్రభుత్వం తమ ఆలోచనపై పునరాలోచన చేయాలన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల పరిస్థితి జీవన మరణ సమస్యగా తయారైందన్నారు. ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతం ప్రజా ప్రతినిధులు ప్రజా ద్రోహులుగా మారవద్దని జేఏసి నాయకులు తిరుపతిరావు హెచ్చరించారు. కేవలం తమ రాజకీయాల కోసం నమ్ముకున్న ప్రజల జీవితాలను బలి చేయవద్దన్నారు. అందరూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలన్నారు.

రాష్ట్రానికి రాజధాని లేదని ఇక్కడి రైతులు 33వేల ఎకరాలు భూములు ఇస్తే వారిన హేళనగా చూస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కాళ్ళకు నమస్కరించి చెబుతున్నాం రాజధానికి మార్చవద్దని అంటూ ఆవేదనను వెల్లగక్కారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు తోత్తులుగా మారవద్దని అన్నారు. ఈ మూడు రాజధానుల అంశంపై త్వరలో కార్యచరణ రూపోందించి ప్రజా పోరాటం వైపు నడుస్తామని జేఏసి నాయకులు వెల్లడించారు.