వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో భాగంగా లబ్దిదారులకు రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని రవాణా మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ పథకానికి సంబంధించిన వివరాల గురించి మీడియాకు వివరించారు.  

అమరావతి: రాష్ట్రంలో వైయస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మందికి లబ్ది చేకూరినట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వివిధ రకాల వాహనాలను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లకు ఆర్థిక భరోసా అందించామని మంత్రి అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం అమరావతి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీమేరకు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

తెల్లరేషన్ కార్డు కలిగిన ఆటోలు, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్స్ యజమాని కం డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరియు వాహన మరమ్మత్తుల నిమిత్తం రూ.10వేలు వంతున ఆర్ధిక సహాయం అందించేందుకు వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. 

read more టాయిలెట్లు లేని సెక్రటేరియట్... నారాయణ కాలేజీల్లా బిల్డింగులు: అమరావతిపై పేర్ని నాని కామెంట్స్

ఈ పథకం అమలుకై గత సెప్టెంబరులో జిఓ నంబరు 34,38ల ద్వారా విధివిధానాలను జారీ చేసి ఏలూరులో దీని అమలుకు శ్రీకారం చుట్టండం జరిగిందన్నారు. ఈ పధకం అమలుకు రూ.400 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా మొదటి విడతలో లక్షా 73వేల 102మందికి లబ్ది పొందినట్లు తెలిపారు. రూ.10 వేలు వంతున ఆయా వాహనదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. 

ఇక రెండవ విడతగా ఈ మీడియా సమావేశం నుండే మరో 62,637మందికి బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా నిధులు జమ చేశామన్నారు. మొదటి విడతలో మొత్తం లక్షా 72వేల 102 మందికి లబ్ది కలిగించగా వారిలో 39,805 మంది ఎస్సిలు, 6,023 మంది ఎస్టిలు, 79021మంది బిసిలు, 17,504 మంది మైనార్టీలు, 20,357 మంది కాపు, 397మంది బ్రాహ్మణ, 9,995 మంది ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారు లబ్ది పొందడం జరిగిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 

రెండవ విడతలో భాగంగా అందిన ధరఖాస్తుల్లో 62,637 మంది అర్హులుగా గుర్తించగా వారిలో 14,528 ఎస్సి, 2,714 ఎస్టి, 26,696 బిసి, 8,196 మైనార్టీ, 6,661కాపు, 112 బ్రాహ్మణ, 3,487 ఇబిసి, 245 క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రూ.10వేలు వంతున వారి బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. 

వైయస్సార్ వాహనమిత్ర పధకం కింద రెండు విడతల్లో మొత్తం 2,36,343 మంది వాహనదారులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ ఏడాది ఇప్పటికే రూ.236కోట్లు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. అర్హులైన వారందరికీ ఈ పధకం కింద లబ్ది కలిగించేందుకు వచ్చే ఏడాది కూడా ఈపధకాన్ని కొనసాగించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. 

read more రైలు ప్రమాదాలకు చెక్... ఈస్ట్ కోస్ట్ రైల్వే వినూత్న ఆలోచన

వైయస్సార్ వాహనమిత్ర పధకాన్ని తీసుకవచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పేర్నినాని ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు. అలాగే రవాణా శాఖకు చెందిన మోటర్ వాహన ఇన్‌స్పెక్ట‌ర్ మొదలు ముఖ్య కార్యదర్శి వరకూ జిల్లా కలెక్టర్లు, ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు తదితర అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పధకం విజయవంతానికి బాగా పనిచేశారని వారందరికీ ప్రభుత్వం తరుపున ప్రత్యేక అభినందలు తెలిపారు. 

ఈ సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు, సంయుక్త కమీషనర్లు ఎస్.ప్రసాదరావు, జె.రమాశ్రీ తదితరులు పాల్గొన్నారు.