- Home
- Telangana
- Warangal : అయ్యో పాపం.. ఆడపిల్ల పుడుతుందనే గర్భిణి తల్లి, ఇద్దరు చిన్నారుల్ని చంపేశారా..? అసలే జరిగిందో..?
Warangal : అయ్యో పాపం.. ఆడపిల్ల పుడుతుందనే గర్భిణి తల్లి, ఇద్దరు చిన్నారుల్ని చంపేశారా..? అసలే జరిగిందో..?
ముక్కుపచ్చలారని ఇద్దరు ఆడబిడ్డలు, ఓ గర్భిణి తల్లి అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్విమ్మింగ్ పూల్ లో ముగ్గురి శవాలు వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది.

పాపం... ముక్కుపచ్చలారని చిన్నారులు, తల్లి దుర్మరణం
తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది. వరంగల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భర్త చెబుతుండగా, అతనిపైనే కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు మిస్టరీని సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చనున్నాయి.
వరంగల్ నగరంలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. పైకి ఇది ప్రమాదంలా కనిపిస్తున్నా, కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతులను 26 ఏళ్ల ఫర్హత్, ఆమె కూతుళ్లు 8 ఏళ్ల ఉమేరా, 6 ఏళ్ల ఆయేషాగా పోలీసులు గుర్తించారు.
ఇది కేవలం ప్రమాదమా లేక కుట్ర ఉందా?
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్లోనే ఈ ఘటన జరిగింది. ఈ పూల్ మృతుల కుటుంబానిదే... అదే వారి ప్రధాన ఆదాయ వనరు. బుధవారం రాత్రి ఫర్హత్ తన కూతుళ్లతో కలిసి పూల్ దగ్గరకు వెళ్లింది. కొద్దిసేపటికే ముగ్గురూ నీటిలో మునిగి కనిపించారు. స్థానికులు, బంధువులు వారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
భర్తపైనే అనుమానాలు..
ఫర్హత్ భర్త అజారుద్దీన్ ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెబుతున్నాడు. తన భార్య, కూతుళ్లు కాలు జారి పూల్లో పడి మునిగిపోయారని అతను తెలిపాడు. అయితే ఈ మాటలను ఫర్హత్ కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. దీంతో అజారుద్దీన్ వాదనపై అనుమానాలు బలపడుతున్నాయి.
ఫర్హత్ గర్భమే ఈ హత్యలకు కారణమా..?
ఫర్హత్ తండ్రి అలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మరింత సీరియస్గా మారింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఫర్హత్ గర్భవతి కావడంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది. మరో కూతురు వద్దనుకున్న అజారుద్దీన్, అబార్షన్ చేయించుకోమని ఫర్హత్పై ఒత్తిడి తెచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు నిజమైతే ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్తో చేసిన హత్యే కావచ్చు. పోలీసులు కూడా ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనా స్థలాన్ని, స్విమ్మింగ్ పూల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని, వాటితో నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. సీపీ సున్ప్రీత్ సింగ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏన్వోలు మండలం, పున్నేలులో జరిగిన ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
కుట్ర కోణం...?
ఈ కేసులో కుట్ర కోణం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది హత్యేనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అజారుద్దీన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతని వాంగ్మూలం, దొరికిన ఆధారాలను బట్టి దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు షాక్లో ఉన్నారు.., న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు.

