- Home
- Telangana
- Viral News: అక్కడ మందు తాగితే 25 చెప్పు దెబ్బలు, రూ. 5 వేల ఫైన్.. వైరల్ అవుతోన్న పోస్టర్
Viral News: అక్కడ మందు తాగితే 25 చెప్పు దెబ్బలు, రూ. 5 వేల ఫైన్.. వైరల్ అవుతోన్న పోస్టర్
Viral News: ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన కొందరు మందుబాబులు మాత్రం ఆ అలవాటును మానరు. తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు పెడుతుంటారు. ఇలా ఇబ్బంది పడ్డ ఓ రైతు తీసుకున్న నిర్ణయం వైరల్ అవుతోంది.

మందుబాబుల బెడదతో రైతుకు తీరని సమస్య
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో ఉన్న ఓ మామిడి తోట రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధాన రహదారికి సమీపంలో ఉండటంతో కొంతమంది మందుబాబులు ఆ తోటను ఆల్కహాల్ సేవించడానికి అడ్డాగా మార్చుకున్నారు. ప్రతిరోజూ తోటలోకి చొరబడి మందు తాగడం, ఖాళీ సీసాలు పడేయడం, కొన్నిసార్లు వాటిని పగలగొట్టడం వల్ల రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
చెప్పినా వినని మందుబాబులు
సదరు రైతు ఆనంద్ ఎన్నిసార్లు హెచ్చరించినా మందుబాబుల తీరు మారలేదు. మామిడి తోటలో ఆల్యహాల్ సేవించడం వల్ల సాగు పనులకు ఆటంకం ఏర్పడింది. నడవడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పగిలిన గాజు సీసాలు కాళ్లకు గుచ్చుకుని గాయాలపాలవుతున్నాయని రైతు వాపోయాడు. ఇలా రోజు రోజుకూ సమస్య పెరుగుతుండటంతో చివరకు ఓ వినూత్న ఆలోచన చేశాడు.
వినూత్నంగా ఆలోచించిన రైతు
మాటలకు వినని మందు బాబులకు గట్టి హెచ్చరిక ఇవ్వాలని రైతు నిర్ణయించుకున్నాడు. ఇకపై తన మామిడి తోటలో మందు సేవిస్తే సహించబోమని స్పష్టంగా తెలియజేయాలనుకున్నాడు. అందుకే పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేశాడు. అందులో “మామిడి తోటలో మందు తాగితే 25 చెప్పు దెబ్బలు, రూ.5 వేల జరిమానా” అని పెద్ద అక్షరాలతో రాయించాడు.
వైరల్ అవుతోన్న పోస్టర్
తోట ముందు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. కనీసం ఈ హెచ్చరికతోనైనా మందుబాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని ఆశిస్తున్నారు. రైతు మాత్రం తాను పెట్టిన నియమాలను కచ్చితంగా అమలు చేస్తానని చెబుతున్నాడు.
గ్రామస్థుల సపోర్ట్
తన తోటలో అనుమతి లేకుండా మందు సేవించడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, బిర్యానీ ప్యాకెట్లు పడేయడం వల్ల సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యపై గ్రామస్థులు కూడా రైతుకు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

