తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్
Telangana Municipal Elections Result 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓ నాాలుగు పట్టణాల ప్రజలు ఆసక్తికర తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది.

రేవంత్ రెడ్డి vs కేసీఆర్
Telangana Municipal Election Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 6 కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది... అయితే ఇప్పటికే కొన్నిచోట్ల కాంగ్రెస్, మరికొన్నిచోట్ల బిఆర్ఎస్ విజయం సాధిస్తున్నాయి. బిజెపి, ఎంఐఎం, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు.
అయితే అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు... ఏదో ఒక పార్టీని గెలిపించారు. కానీ ఓ నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రం ఓటర్ల విచిత్రమైన తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ నాలుగు మున్సిపాలిటీలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాల్లోనివే. ఇంతకూ ఈ మున్సిపాలిటీలు ఏవి? ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో విజయం సాధించింది..? తెలుసుకుందాం.
1. ఆలంపూర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇందులో ఆలంపూర్ ఒకటి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులుంటే అధికార కాంగ్రెస్ 5, ప్రతిపక్ష బిఆర్ఎస్ 5 గెలుచుకున్నాయి. ఇలా ఇరు పార్టీలు చెరిసమానం వార్డులు పంచుకోవడంతో హంగ్ ఏర్పడింది.
2. దేవరకద్ర
ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మరో మున్సిపాలిటీ దేవరకద్రలో కూడా హంగ్ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన పలితాల ప్రకారం మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6 గెలుచుకుంది. ఇక బిఆర్ఎస్ 4, బిజెపి 1, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకుంది.
3. కోహీర్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బిఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బిజెపి 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం హంగ్ పరిస్థితి ఉన్నా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి ఈ మున్సిపాలిటీ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి.
4. ఇస్నాపూర్
హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీ ఇస్నాపూర్ లో కూడా హంగ్ నెలకొంది. మొత్తం 26 వార్డులకు గాను బిఆర్ఎస్ అత్యధికంగా 12 గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 10, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించాయి. ఇక్కడ విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు.

