ఢిల్లీ లిక్కర్ స్కాం : ఎమ్మెల్సీ కవితకు మంత్రి కొడుకు సపోర్ట్.. అదంతా అందుకే అంటూ.. గుసగుసలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సపోర్టుగా ఓ మంత్రి కొడుకు రంగంలోకి దిగాడు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి సుప్రీం తలుపులు తట్టాడు.
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కొత్త ట్విస్టు తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆమె భర్త అనిల్ పేరు కూడా అక్కడక్కడ కొన్నిసార్లు వినిపించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేసీఆర్ సహా పలువురు ఆప్ నేతలతో కలిసి సౌత్ గ్రూప్ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ కేసులో ఈడీ విచారణలు, అరెస్టులు, జైళ్ళకు వెళ్లడం, బెయిల్ మీద రావడం లాంటివి అన్ని జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈ కేసులో సరికొత్తగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడి, సిబిఐలు కేసు గురించి ప్రస్తావించే సమయంలో.. సౌత్ గ్రూప్ అని అంటున్నారని.. కేసుకు సంబంధించిన కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నాయని అన్నారు. కానీ వ్యక్తుల గురించి చెప్పే సమయంలో సౌత్ అని చెప్పడం ద్వారా దక్షిణ భారత పౌరులందరినీ అవమానించినట్లేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతోపాటు గతంలో చెప్పిన కొన్ని కేసుల తీర్పులను ఊటంకించారు. వ్యక్తుల విషయంలో ఫలానా ఏరియా అంటూ అందరినీ చిన్నచూపు చూసేలా మెన్షన్ చేయవద్దని చెప్పిన తీర్పులను ప్రస్తావించారు. దీనికి కోర్టు కూడా ఏకీభవించింది. సిబిఐ, ఈడిలకు ఈ మేరకు లెటర్ ఇవ్వాలంటూ పేర్కొంది. అయితే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇప్పుడు కొత్తగా దీంట్లోకి కార్తీక్ రెడ్డి ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే విషయమే చర్చనీయాంశంగా మారింది.
వైసిపి ఎంపీ కొడుకు అరెస్టు సమయంలో...కవిత విచారణ సమయంలో.. సిబిఐ, ఈడీలు.. సౌత్ గ్రూప్ లాబీ అన్న పేర్లను వాడాయి. ఇప్పటికి వాడుతున్నాయి. దీనిమీద ఇప్పటివరకు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. సౌత్ అనే పదం వాడొద్దని మెన్షన్ చేయలేదు. కవిత తరపున కానీ, వైసీపీ ఎంపీ కొడుకు తరఫున కానీ ఎంతో పేరు మోసిన లాయర్లు ఈ కేసుల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ వారు ఎవరు కూడా సౌత్ అనే పదాన్ని పట్టించుకోలేదు.
సడన్ గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి దీంట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు అని చర్చ ఇప్పుడు టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కార్తీక్ రెడ్డి కూడా మామూలు వ్యక్తి కాదు. యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాడు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకుగానే కాకుండా తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం రాజకీయాలతో పాటు రాజేంద్రనగర్ కేంద్రంగా కార్తీక్ రెడ్డి పనిచేస్తున్నారు.
అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజేంద్రనగర్ నుండి పోటీ చేస్తున్నట్లుగా ఇటీవల జరిగిన ఓ మీటింగ్లో ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనను సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రతిఘటించారు. దీంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. కానీ పార్టీ పెద్దల జోక్యంతో ఆ పంచాయతీ ముగిసింది.
ఈ నేపథ్యంలోనే.. కార్తీక్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత తరపున వకాల్తా పుచ్చుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే.. రాజేంద్రనగర్ సీటు కోసమే అయి ఉంటుందని.. పార్టీ పెద్దల మెప్పు పొందేందుకే ఇలా చేసి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చాడంటే.. ఇది పార్టీ నుంచి వచ్చిన అంశం కాదని.. తనకు తానుగా.. సొంతంగా.. ఈ చర్య తీసుకుని ఉంటాడని.. పార్టీ పెద్దల మెప్పు పొందడం కోసమే ఇలా చేసి ఉంటాడని టాక్ వినిపిస్తోంది.