అప్పుడే అయిపోలేదు, దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
Rain Alert: మొంథా తుఫాన్ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలకు కురిశాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

బలహీనపడిన మొంథా
మొంథా తుపాను తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడింది. గురువారం ఉదయం అది ఛత్తీస్గఢ్ ప్రాంతాల పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారగా, శుక్రవారం నాటికి మరింత బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మొంథా కారణంగా గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
ఏపీలో నమోదైన వర్షపాతం
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగర ప్రాంతంలో అత్యధికంగా 11.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాలు ప్రకారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని నివేదికలు చెబుతున్నాయి.
మరో అల్పపీడనం
ఐరోపా వాతావరణ మోడల్ సూచన ప్రకారం బంగాళాఖాతంలో, అండమాన్ సమీపంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ అల్పపీడనం సాధారణంగా బంగ్లాదేశ్ వైపు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శుక్ర, శనివారాల్లో వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకే వ్యాపించి ఉంది. వాతావరణశాఖ ప్రకారం ఈ ఆవర్తనం 24 గంటల్లో ఛత్తీస్గఢ్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంటకు 30–40కి.మీ వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిశాయి.
అంచనాలకు మించి వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కురవాల్సి వర్షాలు సాధారణ అంచనాలను అధిగమిస్తున్నాయి. ఈ కాలంలో సాధారణంగా కురవాల్సిన సగటు వర్షపాతం 11.02 సెం.మీ అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న వర్షపాతం చూస్తుంటే దీనిని అధిగమించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.