Telangana: తెలంగాణలో కొత్త వైన్ పరిశ్రమ.. ఈ ప్రాంత ప్రజల పంట పండనుంది. ఎక్కడంటే..
బీర్, విస్కీకి సమానంగా వైన్కు సైతం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. డిమాండ్కు అనుగుణంగా తయారీ మాత్రం లేదు. ఇందులో భాగంగానే తెలంగాణలో కొత్త వైన్ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.

పెరుగుతోన్న వైన్ వినియోగం
తెలంగాణలో వైన్కు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే (జనవరి–జూన్) రూ.300 కోట్ల విలువైన 2.67 లక్షల వైన్ కార్టన్లు అమ్ముడయ్యాయి. అయితే అందులో స్థానికంగా ఉత్పత్తి అయినవి కేవలం 8,725 కేసులే కాగా.. దేశవిదేశాల నుంచి దిగుమతులు ఎక్కువగా ఉండటంతో స్థానిక ఉత్పత్తి లోపిస్తోంది.
కొత్త వైనరీలకు మార్గం సుగుమం అయ్యేలా
ఈ విస్తరిస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వైనరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని పలు ప్రాంతాలను పరిశీలించి, వాటిని అనువైన కేంద్రాలుగా గుర్తించింది. ద్రాక్ష తోటలు 700 ఎకరాలకుపైగా విస్తరించి ఉండటం కూడా ఈ ప్రాంతాలకు ప్లస్ పాయింట్గా మారింది.
ముందుకొచ్చిన మూడు సంస్థలు
కొత్తగా వైన్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు బ్లూసీల్, ఈరియా, బగ్గా అనే మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో ఒక కంపెనీకి తొలిదశలో అనుమతిని ఇచ్చే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై నాలుగు రోజుల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు నివేదికపై తుది నిర్ణయం కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఎవరికి లాభం జరగనుంది.?
ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రమే ఏడాదికి 8 లక్షల బల్క్ లీటర్ల సామర్థ్యంతో ఒకే ఒక వైన్ ఫ్యాక్టరీ ఉంది. కానీ అది సరిపోదని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. స్థానికంగా వైనరీలు పెరిగితే.. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఇక ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రం రాయితీలు ఇస్తుండటం వల్ల, రైతులకు కూడా ప్రయోజనం కలగనుంది. ద్రాక్షతో పాటు ఉసిరి, పైనాపిల్, ఆపిల్, అరటి వంటి పండ్లతో వైన్ తయారీకి వీలు ఉండటం రైతులకు కూడా కలిసొస్తుంది.
గత మూడేళ్లలో వైన్ విక్రయాలు ఎలా ఉన్నాయంటే
* 2021-22లో – 1.87 లక్షల కేసులు (రూ.201 కోట్లు), ఇందులో స్థానికంగా తయారైనవి కేవలం 16,205 కేసులే
* 2022-23లో – 2.35 లక్షల కేసులు (రూ.260 కోట్లు)
* 2023-24లో – 2.41 లక్షల కేసులు (రూ.275 కోట్లు)
* 2025 ప్రథమార్థంలో – 2.67 లక్షల కేసులు (రూ.300 కోట్లు)
ఈ గణాంకాలు చూస్తే… రాష్ట్రంలో వైన్ వినియోగం ఎలా వేగంగా పెరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో ఒక కొత్త వైనరీకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.