- Home
- Telangana
- Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?
Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?
IMD Rain Alert : తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ ను తాకాయి… బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో విస్తరించాయి. మరి ఇవి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ను ఎప్పుడు తాకే అవకాశాలున్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..
Monsoon Update : మండటెండలతో సతమతం అవుతున్న భారతీయులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. ఇప్పటికే వర్షాలు మొదలై వాతావరణం కాస్త చల్లబడింది... అయితే ఇకపై ఎండల తీవ్రత తగ్గి వర్షాలు పెరుగుతాయని ప్రకటించింది. రోహిణి కార్తె ఎండలకు గుడ్ బై చెబుతూ నైరుతు రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయని... అంటే ఇక అసలుసిసలైన వర్షాకాలం ప్రారంభంకానుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న రుతుపవనాలు..
వాతావరణ శాఖ అంచనా వేసినట్లు నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలకు తాకనున్నాయి. ఇప్పటికే చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు లక్షద్వీప్ కు చేరుకున్నాయట... ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా, లక్షద్వీప్ బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇవి ఒకటి రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాయని తెలిపింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి... ఇవి ఇక ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రెండుమూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని... జూన్ లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, ఏపీలో వర్షాలు జోరందుకోగానే ఎండలు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈసారి వర్షాకాలం ఎలా ఉండనుందంటే..
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు లేవట. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని... చెప్పాలంటే 2018 వర్షాకాల పరిస్థితులు రిపీట్ అవుతాయని తెలిపారు. గత నాలుగైదేళ్ల స్థాయిలో అయితే వర్షాలుండవని వెదర్ మ్యాన్ స్పష్టం చేశారు.
లోటు వర్షపాతం అంటే 2014-15 సమయంలో మాదిరిగా మరీ కరవు పరిస్థితులు ఉండవని.. ప్రజలు ఆందోళన చెందవద్దని వెదర్ మ్యాన్ సూచించారు. ముఖ్యంగా సౌత్ తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా రైతులు నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు వేసుకోవాలని సూచించారు. ముందుగా పక్కా ప్రణాళికతో వ్యవసాయం చేయాలని... నీటి ఎద్దడిని తట్టుకునేందుకు సిద్దంగా ఉండాలని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
MONSOON 2026 OUTLOOK
STRONG EL-NINO + Positive IOD
NORMAL - DEFICIT MONSOON AHEAD
This year rainy season will be similar to 2018, less rains are expected. Don't expect 2025 type rains at all this year
All the months of Monsoon - 2026 (Jun - Sep) will be okayish - below normal… pic.twitter.com/Hs6yfB6jce— Telangana Weatherman (@balaji25_t) April 11, 2026
తెలంగాణలో వర్షాలు...
నిన్న (మే 27, బుధవారం) వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. కానీ ఇవాళ (మే 28, గురువారం) ఉదయం నుండి మళ్లీ భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రానికి మళ్ళీ వాతావరణం పూర్తిగా మారిపోతుందని... వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక రేపు (మే 29, శుక్రవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
రేపు తెలంగాణలో మండుటెండలు..
ఇక రేపు (మే 29, శుక్రవారం) ఎండావాన పరిస్థితులు కొనసాగుతాయంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మండుటెండలు ఉంటాయని.. వడగాల్పులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంకో రెండుమూడు రోజులే ఎండలు కొనసాగుతాయి... ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
तेलंगाना का 7-दिन का पूर्वानुमान (मध्याह्न) 0300 UTC पर आधारित, 1300 घंटे IST पर जारी किया गया दिनांक:/ 7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated : 28.05.2026 pic.twitter.com/6U5e1SJWbU
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 28, 2026
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (మే 28, గురువారం) మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
పిడుగులతో పాటు గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో వీచే బలమైన ఈదురు గాలులతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రఖర్ జైన్. వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

