కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నవారికి... మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ
పేదలకు అండగా నిలబడేందుకే తాను మహబూబ్ నగర్ ను ఎంచుకొన్నానని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
మహబూబ్ నగర్: పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని... వారు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ వారైనా వదిలేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ నెల 13 న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు మహబూబ్ నగర్ జిల్లా సందర్శనలో భాగంగా వీరన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి తిరిగి వెళుతున్న సందర్భంలో అదే ప్రాంతానికి చెందిన గంటేల వెంకటేష్ కుటుంబం భూమి సమస్య విషయమై మంత్రి కాన్వాయ్ కు అడ్డు పడిన విషయం తెలిసిందే.
బుధవారం ఈ విషయమై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఎస్. వెంకట రావు సమక్షంలో ఆర్డిఓ, డిఎస్పి శ్రీధర్, తహసిల్దార్ లతోపాటు, బాధిత కుటుంబ సభ్యులందరిని పిలిపించి విచారించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... పేదలకు అండగా నిలబడేందుకే తాను మహబూబ్ నగర్ ను ఎంచుకొన్నానని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ లో ఎవరైనా పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని... వారెవరైనా, ఎంతటివారైనా వారిని వదిలి పెట్టమని తెలిపారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడిన గంటేల వెంకటేష్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబమని... అయితే వారికి సంబంధించిన భూమి సమస్యను తన దృష్టికి ఎప్పుడు తీసుకురాలేదని, ఒకవేళ వచ్చి ఉంటే ఎప్పుడో పరిష్కరించే వాడినని అన్నారు.
వెంకటేష్ కుటుంబానికి భూమి అమ్మిన వ్యక్తి అదే భూమిని మరొకరికి కూడా అమ్మాడని...ఈ విషయం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని మంత్రి స్వయంగా డీఎస్పీ శ్రీధర్ ని పిలిపించి చెప్పారు. అంతేకాక బాధిత కుటుంబానికి న్యాయంగా రావాల్సిన భూమిని 100% వారికి ఇస్తామని తెలియజేశారు. బాధిత కుటుంబానికి రక్షణగా ఉంటామని... వారు ఎలాంటి భయాందోళనలు గురికావద్దని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
తాను మంత్రిగా ఉన్నప్పు టికీ పేద ప్రజల సంక్షేమం తప్ప మరొకటి లేదని... ఎవరైనా పేద వారి పై దౌర్జన్యం చేస్తే కటకటాల పాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. పేదలను మోసం చేసిన, దౌర్జన్యం చేసిన సహించమని ఆయన పునరుద్ఘాటించారు. వారి భూమిని వారికి వెంటనే ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ సీతారామ రావును ఇదివరకే ఆదేశించామని మంత్రి వెల్లడించారు.