అందరం కలిసి టీం వర్క్ చేద్దాం: పల్లెనిద్రలో మంత్రి వ్యాఖ్యలు
హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామస్తులతో కలిసి గ్రామమంతా తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు. హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు. సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతే గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.
'' గ్రామాలు స్వయం పోషకాలు కావాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాగునీటి రాకతో పల్లెలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించే సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'' అని అన్నారు.
''ప్రజల సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి టీం వర్క్ చేస్తే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యల యొక్క మూలాలు తెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యం అవుతుంది. పల్లెనిద్రలతో ప్రజల సమస్యలు దగ్గర నుండి చూస్తే ప్రజల కోణం నుండి అర్ధం అవుతుంది. అప్పుడు పనుల ప్రాధాన్యతా క్రమం అర్ధం అవుతుంది. అందుకే ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడిగా పల్లెనిద్రలను ప్రారంభించాను. మంత్రిగా దానిని కొనసాగిస్తున్నాను'' అని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.