IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవేగా
IMD Rain Alert : తెలంగాణలో నేడు(సోమవారం) కూడా భారీవర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే విద్యాసంస్థలకు సెలవు ఉండటంతో హైదరాబాద్ వంటి నగరాల్లో సమస్యలు తగ్గుతాయి.

నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు ఇవాళ (సెప్టెంబర్ 15, సోమవారం) కూడా కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. అయితే గత రెండ్రోజులుగా విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈ వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇవాళ్టి నుండి విద్యార్థులు స్కూళ్లకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళతారు... కాబట్టి వర్షాలతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది... ఇదే సమయంలో స్కూళ్లు, ఉద్యోగులకు చెందిన వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తప్పవు.
తెలంగాణలో కాలేజీల బంద్
అయితే నేడు తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ చేపట్టాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వృత్తివిద్యా కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఎంబిఏ కాలేజీలతో పాటు అన్ని వృత్తివిద్యా కాలేజీల యాజామాన్యాలు సెప్టెంబర్ 15న బంద్ ప్రకటించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ (FATHI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా నేడు ఇంజనీరింగ్ తో పాటు మేనేజ్మెంట్ కాలేజీలు (ఎంబిఏ), బి.ఈడి, నర్సింగ్, పారామెడికల్, లా కాలేజీలు బంద్ కానున్నాయి. కాబట్టి ఈ కాలేజీల విద్యార్థులు, టీచర్లు ఇంటికే పరిమితం అవుతారు కాబట్టి సోమవారం వర్షాల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి... అలాగే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు తక్కువ.
నేడు తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండుమూడు రోజులుగా తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. అయితే ఇది ఇవాళ సాయంత్రానికి బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే నేడు (సోమవారం) తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ లో కుండపోత వర్షాలు
ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి... ఇవాళ కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం కురిసిన వర్షాలకు నాలాలు ఉప్పొంగడంతో ప్రమాదాలు జరిగాయి... ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫ్నగర్లో ఇద్దరు, ముషీరాబాద్లో ఒకరు గల్లంతయ్యారు. అఫ్జల్సాగర్ నాలాలో మామా, అల్లుడు కొట్టుకుపోగా... వినోదనగర్లో నాలాలో సన్నీ అనే యువకుడు కొట్టుకుపోయాడు. గచ్చిబౌలిలో గోడ కూలి మరొకరు మృతి చెందారు. ఇలా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం నలుగురిని బలితీసుకోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరక్కుంగా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి ఈ వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.