- Home
- Telangana
- IMD Rain Alert : అక్టోబర్ 8-12 వరకు అల్లకల్లోలమే... ఈ ప్రాంతాల్లో మళ్ళీ జోరువానలు, ఈదురుగాలులు
IMD Rain Alert : అక్టోబర్ 8-12 వరకు అల్లకల్లోలమే... ఈ ప్రాంతాల్లో మళ్ళీ జోరువానలు, ఈదురుగాలులు
IMD Rain Alert : ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా రాబోయే ఐదురోజులు వర్షాలు దంచికొడతాయని హెచ్చరించింది. మరి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటే…

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
IMD Rain Alert : అరేబియా సముద్రంలో ఏర్పడిన 'శక్తి' తుఫాను క్రమంగా బలహీనపడుతోందని... ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ (అక్టోబర్ 7, మంగళవారం) ఇది మరింత బలహీనపడనుందని... 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండి తెలిపింది. దీనికి ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు తోడవడంతో భారతదేశంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది.
మొత్తంగా వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారుతోంది... దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండటం తెలుగు ప్రజలను ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఏపీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఇలాంటి సమయంలో భారీ వర్షాలు కురిస్తే వరదలు తప్పవు... దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో అల్లకల్లోలమే
రాబోయే 5-6 రోజులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెటలర్జీకల్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ 8 నుండి 11 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయని IMD హెచ్చరించింది.
ఇక కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. కాబట్టి ప్రజలు వర్ష సమయంలో చెట్ల కింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండటం మంచిదికాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తోంది ఐఎండి.
తెలంగాణలో ఐద్రోజులు వర్షాలే వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే రాబోయే ఐదురోజులు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో కూడా ఉరుములు మెరుపులతో వాతావరణం కాస్త అలజడిగానే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
తమిళనాడులో అక్టోబర్ 07 నుండి 12 వరకు, కేరళ & మాహేలో 07 నుండి 13 వరకు, లక్షద్వీప్ తో పాటు కర్ణాటక తీరప్రాంతాల్లో 07 నుండి 11 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది.
తెలంగాణతో పాటు కర్ణాటకలో రాబోయే ఐదురోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు... తమిళనాడు, కేరళ, మాహే, లక్షద్వీప్, కోస్తాంద్ర, యానాం, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది.
గత 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం
అక్టోబర్ 06 నుండి 07న ఉదయం వరకు తెలంగాణలో అత్యధికంగా నిర్మల్ జిల్లా ముథోల్ లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక వరంగల్ జిల్లా ఖానాపూర్, నల్గొండ జిల్లా నిడమనూరు, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లలో 8 సెంమీ, నిజామాబాద్ జిల్లా రంజల్ లో 7 సెంమీ వర్షపాతం నమోదయ్యింది.
ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక వర్షపాతం గుంటూరు లో 9 సెంమీ నమోదైంది. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 8సెంమీ, పల్నాడు జిల్లా మాచర్లలో 7సెంమీ, సత్తెనపల్లిలో 7 సెంమీ వర్షపాతం నమోదయ్యింది.
మొత్తంగా ఏఏ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటే..
భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం నుండి ఐదారు రోజులపాటు పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు అస్సాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.