High speed trains: హైదరాబాద్కు హై స్పీడు రైళ్లు, ఇక ఆ నగరాలకు 2 గంటల్లో చేరిపోవచ్చు
High speed trains: దేశంలో రవాణా వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికే సిద్ధం చేసింది. అందులో భాగంగానే బడ్జెట్ 2026లో 7 హై స్పీడ్ రైళ్లను ప్రకటించింది. అందులో మూడు హైదరాబాదుకు ప్రయాణం చేస్తాయి. ఇది తెలుగువారికి బాగా కలిసి వచ్చే అంశం.

హైదరాబాద్ కు హైస్పీడ్ రైళ్లు
హైదరాబాదును కేంద్రంగా చేసుకొని మూడు హై స్పీడ్ రైలు మొదలవబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశానికి 7 హైస్పీడ్ రైళ్లను ప్రకటించారు. అందులో మూడు రైళ్లు హైదరాబాద్ తో అనుబంధం కలిగి ఉన్నాయి. ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా ఇప్పుడు మరి కొన్ని రైళ్లకు అనుమతి లభించింది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న హైదరాబాదును ఇతర మెట్రో నగరాలతో కలిపేందుకు ఈ హై స్పీడ్ రైళ్ల ప్రధాన లక్ష్యం. దీనివల్ల ప్రయాణ సమయం విపరీతంగా తగ్గుతుంది. కొన్ని గంటల్లోనే మెట్రో నగరాలకు చేరుకోవచ్చు. ఈ హై స్పీడ్ రైళ్ళను హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై టు హైదరాబాద్, పూణే టు హైదరాబాద్ మార్గాలలో వేశారు. కాబట్టి ఆ నగరాలకు కొన్ని గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది.
రెండుగంటల్లో వెళ్లిపోవచ్చు
ప్రస్తుతం హైదరాబాదు నుంచి బెంగళూరు లేదా చెన్నై వెళ్లాలంటే రైలు ప్రయాణం అతి తక్కువగా 10 నుంచి 14 గంటల వరకు చేయాల్సి వస్తుంది. అదే విమానంలో వెళ్లాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. అలాగని విమాన టికెట్లు అందరికీ కొనే స్థాయిలో ఉండవు. అందుకే హై స్పీడ్ రైలు గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాదు నుంచి బెంగళూరు కేవలం రెండు గంటల్లో, చెన్నై కి కేవలం రెండున్నర గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది.
ఎన్నాళ్లు పడుతుంది?
ప్రస్తుతం బడ్జెట్లో హై స్పీడ్ రైలు ప్రాజెక్టులను ప్రకటించారు. ఆ మార్గాలపై సర్వేలు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వంటివి మొదలవుతాయి. భూసేకరణ, ఎంత ఖర్చు, సాంకేతిక అంశాలపై కూడా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల సమయం పడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ హై స్పీడ్ రైళ్లపై ప్రత్యేక దృష్టి పెడితే రాబోయే నాలుగైదేళ్లలో బుల్లెట్ ట్రైన్ కల నిజమయ్యే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ కు లాభమేంటి?
హైదరాబాద్ కు హైస్పీడ్ రైలు అంటే కేవలం అది ప్రయాణానికి మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల ఆ నగరాల మధ్య వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు, పర్యాటకం పెరుగుతాయి. అయితే ఉద్యోగులు ఒకరోజులోనే ఇతర మెట్రో నగరాలకు వెళ్లి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోడ్లపై రద్దీ తగ్గుతుంది. యువత, ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు ఈ హై స్పీడ్ రైళ్లు పెద్ద వరమనే చెప్పాలి.

