Rain Alert: కూల్ న్యూస్ చెప్పిన వాతవారణ శాఖ.. వచ్చే మూడు రోజులు వానలే వానలు
రుతుపవనాలు ఎంట్రీ తర్వాత కూడా ఆశించిన స్తాయిలో వర్షాలు కురవలేదు. జూన్ నెల మొత్తంలో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. అయితే తాజాగా వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అరేబియా సముద్రంలో అల్పపీడనం
అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. అదే సమయంలో బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో, మరో అల్పపీడనం ఆదివారం నాటికి ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదలుతూ, ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ ప్రాంతాలవైపు సాగనుందని అంచనా. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్ష సూచనలు
రాబోయే మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులను అధికారులు అలర్ట్ చేశారు. వేటకు వెళ్లకూడదని తెలిపారు.
ఉత్తర-దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన
ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నప్పటికీ, గాలుల వేగం స్వల్పంగా (30–40 కి.మీ. వరకు) ఉండే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఇదే తరహా వాతావరణం ఏర్పడనుంది. బలమైన గాలులు, ఉరుములతో కూడిన వానలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.
తెలంగాణలో కూడా
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తర్నం వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక వంతెన పూర్తిగా నీట మునిగింది.
మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరింది. భైంసా పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రైతులకు సంతోషం
ఈ వర్షాలు పత్తి, సోయాబీన్స్ వంటి ఖరీఫ్ పంటల మొలకలకు ఎంతో అవసరమైన తేమను అందించాయి. రైతులు ఇది మంచి సూచనగా భావిస్తున్నారు. కానీ మరోవైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో వర్షాల ప్రభావంతో బొగ్గు తవ్వకాల్లో ఆటంకం ఏర్పడింది.
దాదాపు 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా కృష్ణా నదిలోనూ ప్రవాహం పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు సీజన్లో తొలిసారిగా లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. కానీ అదే సమయంలో 9వ నెంబర్ గేటు రోప్ తెగిపోవడం ప్రమాద సూచికగా మారింది.