అప్పుడే ఊపిరి పీల్చుకోకండి.. మళ్లీ దంచి కొట్టనున్న వర్షాలు. మరో అల్పపీడనం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణలో తీవ్ర నష్టంవాటిల్లింది. అయితే ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గినా మళ్లీ ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు.

మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
భారీగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. రహదారులు, ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పడినట్లు కనిపిస్తోంది. కానీ బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో సెప్టెంబర్ 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీంతో మరోసారి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
KNOW
కొనసాగనున్న వర్షాలు
సెప్టెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలర్ట్ జారీ
శనివారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అదే విధంగా ఆదివారం కూడా ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో
హైదరాబాద్లో ఉదయం పొడి వాతావరణం ఉండి సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇక గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సర్వాపూర్ మండలాల్లో 27.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వరదలతో తీవ్ర నష్టం
ఉత్తర తెలంగాణలో కురిసి భారీ వర్షాలకు కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో జీవన విధానం పూర్తిగా దెబ్బతింది. వాగులు, చెరువులు పొంగిపొర్లగా అనేక కాలనీలు నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారులు కూడా కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి.