- Home
- Telangana
- Heavy rains: దంచికొడుతున్న వానలు.. హైదరాబాద్ జలమయం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Heavy rains: దంచికొడుతున్న వానలు.. హైదరాబాద్ జలమయం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Heavy rains: హైదరాబాద్లో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాణలో భారీ వర్షాలు
Heavy rains: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాలు వర్షపు నీటితో జలమయం అయ్యాయి. ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగళ్ల వానలు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలు దెబ్బతినడంతో పాటు పలు కొనుగోలు కేంద్రాలలో వరి, మొక్కజొన్న తడిసింది. పలు ఇళ్ళు దెబ్బతిన్నాయి.
హైదరాబాద్ నగరంలో దంచికొట్టిన వర్షం
అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా బుధవారం మధ్యాహ్నం భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. కోటి, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎంజే మార్కెట్, చాదర్ఘాట్, మలక్పేట్, చాంపాపేట్, సికింద్రాబాద్, బషీర్బాగ్, బంజారాహిల్స్, హబ్సిగూడ, తార్నాక, నాంపల్లి, చార్మినార్, అంబర్పేట్, రామంతపూర్, కూత్బుల్లాపూర్, బోరబండ, హైటెక్ సిటీ, కుందాపూర్, గచ్చిబౌలి, NAC (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్), శంషాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది.
వాతావరణ శాఖ హెచ్చరికలు
భారీ నుంచి మోస్తరు వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. వర్షాల సమయంలో ట్రాఫిక్ జామ్లు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ అంతటా వర్ష ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల వరకూ తగ్గవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి అంబర్పేట్ మిలత్ కమ్యూనిటీ హాల్ వద్ద 20 మిల్లీమీటర్ల వర్షం, మలక్పేట్ పాల్టన్ కమ్యూనిటీ హాల్ వద్ద 18.5 మిల్లీమీటర్లు, మూసారాంబాగ్లో 17 మిల్లీమీటర్లు, అస్మాన్గఢ మలక్పేట్లో 16 మిల్లీమీటర్లు, హిమాయత్నగర్లో 14.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ముషీరాబాద్, రాజేంద్రనగర్, బాలానగర్, మారెడ్ పల్లి, బండ్లగూడ, ఉప్పల్, కూత్బుల్లా పూర్ ప్రాంతాల్లోనూ 5 నుంచి 12 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావం
రుతుపవనాల ప్రభావం కూడా త్వరలోనే రానుందని వాతావరణ శాఖ తెలిపింది. సౌత్ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలో రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వర్షపాతం మరో మూడు రోజులు కొనసాగే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.