Fact Check: ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.? సోషల్ మీడియాలో వైరల్
పెరిగిన సోషల్ మీడియా విస్తృతితో సమాచారం విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో చేతిలో వాలిపోతోన్న రోజులివీ. అయితే నెట్టింట వైరల్ అయ్యే విషయాలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ఉండనుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మే 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానాలో బంకులు ఆదివారం మూతపడతాయనేది సదరు వీడియో సారాంశం.
ఈ సమాచారంతో కూడిన ఒక చిన్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది ఈ వీడియో క్లిప్ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ఇంతకీ ఈ న్యూస్ ఎందుకు ఎందుకు వైరల్ అవుతోంది.? దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి వైరల్ అవుతోన్న ఈ వీడియో ఇప్పటిది కాదు 2017కి సంబంధించిన వీడియో. 2017 సమయంలో ప్రధానమంత్రి మోదీ "మన కీ బాత్"లో పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు. అందుకు స్పందనగా 8 రాష్ట్రాల్లో (తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా) ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తామని పెట్రోల్ బంకుల యజమానుల సంఘం ప్రకటించింది.
అయితే ఈ ప్లాన్ అమల్లోకి రాలేదు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అప్పటి వీడియోనే ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెట్రోల్ బంకుల యజమానుల సంఘం కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాత వీడియో క్లిప్ను మళ్లీ కొత్తగా వైరల్ చేస్తుండడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.