హైదరాబాదుకు రాక: బిజెపిలో చేరికపై ప్రశ్నకు జవాబివ్వని ఈటెల రాజేందర్
బిజెపిలో చేరుతున్నారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు.
తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకున్నారు. అనుచరులు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం చెప్పారు. కొద్ది రోజులుగా ఆయన ఢిల్లీలో మకాం వేసి బిజెపి పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. బిజెపిలో చేరిక విషయంపై ఆయన వారితో చర్చలు జరిపారు.
బిజెపిలో చేరుతున్నారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు. అలాగే, బిజెపి నుంచి తనకు లభించిన హమీలపై కూడా నోరు విప్పలేదు. మీడియాతో మాట్లాడుకుండానే ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారు.
తన ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రేపు శుక్రవారం రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే వారం ఆయన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈటెల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి తెలంగాణ నాయకులు ఆహ్వానిస్తున్నారు.
ఈటెల రాజేందర్ తో పాటు ఐదుగురు బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. వారిలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ తో పాటు ఆయన కూడా ఢిల్లీ వెళ్లారు.
అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈటెల వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కేసీఆర్ స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.