హుజురాబాద్: వరదల్లో చిక్కుకున్నవారి ఆకలిబాధను తీర్చి... మానవత్వం చాటుకున్న ఈటల
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదనీరు ఇళ్లలోకి చేరి తీవ్ర అవస్థలు పడుతున్న జమ్మింకుంట వాసుల ఆకలిబాధ తీర్చారు మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్.
కరీంనగర్: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా రాత్రి నుండి భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వరదనీరు చేరింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహాయ సహకారాలు అందించారు.
జమ్మికుంట పట్టణంలో భారీ వర్షాలతో నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీలో ఈటల రాజేందర్ పర్యటించారు. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో కొందరు కాలనీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మిగతావారు అక్కడే బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే వుండిపోయారు.
ఇళ్లలోకి వర్షం చేరి సరుకులన్నీ తడిసిపోవడంతో వంట కూడా చేసుకునే పరిస్థితి లేక కాలనీవాసులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ మంత్రి ఈటల వెంటనే తన సొంత డబ్బులతో అల్పాహారం వండించి హౌసింగ్ బోర్డ్ కాలనీవాసుల ఆకలి బాధను తీర్చారు.
మరికొన్నిరోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఈటల సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని సూచించారు.