జనగామలో జంపింగ్ పాలిటిక్స్... బిఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత హీటెక్కుతున్నాయి. నాయకులు పార్టీలు మారుతుండటంతో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్నాయి.

Janagama Politics
జనగామ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు అన్ని పార్టీలు భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాదు గ్రామ స్థాయిలోనూ ఈ చేరికలు కొనసాగుతున్నాయి. ఇలా తాజాగా జనగామ జిల్లాకు చెందిన ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమక్షంలో బిఆర్ఎస్ గూటికి చేరారు.
Janagama Politics
జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాల ఎంపిటిసి మహ్మద్ జకీర్ హుస్సేన్ బిఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, యువజన నాయకుడు మహ్మద్ మేహర్ తో పాటు మరికొందరు నాయకులు ఎంపిటిసి జకీర్ తో పాటు అధికార పార్టీలో చేరారు.
Janagama Politics
వరంగల్ జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామ పర్వతగిరిలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఎంపిటిసి జకీర్ తో పాటు ఆయన వెంటవచ్చిన నాయకులకు బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
Janagama Politics
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని వీడి తమతో కలిసి పనిచేసేందుకు సిద్దమైన నాయకులను కలుపుకుపోవాలని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. తమ పార్టీలో చేరేవారికి సముచిత గౌరవం, గుర్తింపు వుంటుందని అన్నారు. అందరూ కలిసి కేసీఆర్ పాలనలో అందిస్తున్న ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.