ఈఎస్ఐలో మరో నాలుగు వైద్యసేవలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి., హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి మాట్లాడారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి., హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి మాట్లాడారు.
నవ భారత నిర్మాణంలో భాగంగా ప్రధానినరేంద్రమోదీ నేతృత్వంలో అనేక ఆరోగ్య సంరక్షణ పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఐదు లక్షల ఆరోగ్య భీమా సదుపాయం గల ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప పథకం అని, దీని ద్వారా దేశంలో ఎక్కడయినా కార్పొరేట్ వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ధర కంటే, 50% నుండి 90% తక్కువ ఖర్చుతో ఔషధాలను అంధించే జన ఔషధీ కేంద్రాల వ్యవస్థ, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, మిషన్ ఇంధ్ర దనుష్ మొదలైన పథకాలు ప్రజలకు గొప్ప వరమని మంత్రి పేర్కొన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ హైదరాబాద్ సేవలు చాలా ప్రశంసనీయమని, డీన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అహర్నిశలు కృషి చేసి సరికొత్త ఆవిష్కరణలతో సరైన సమయంలో రోగులకు వైద్య సేవలను అందించారని కిషన్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తరువాత అనేక సార్లు ఈ.ఎస్.ఐ ఆసుపత్రిని సందర్శించానని, కోవిడ్ మహమ్మారి వ్యాపించిన పరిస్థితుల్లో కూడా ఈ కళాశాలలో ప్రత్యేక వార్డులను ప్రారంభించానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
హైదరాబాద్ ఈ.ఎస్.ఐ 2016వ సంవత్సరంలో ప్రారంభమైందని, వైద్య కళాశాలకు అనుబంధంగా అధునాతన వసతులు ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి ఉండటం వల్ల, ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులు, వివిధ రకాల వైద్యం కోసం వచ్చే రోగులను, చదువుకునే సమయంలోనే పరీక్షించి, విస్తృతమైన పరిజ్ఞానం పొందేందుకు అవకాశం లభించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. దేశంలోనే ఈ.ఎస్.ఐ. ఆసుపత్రులలో ఎంబిబిఎస్, పిజి, పిజి సూపర్ స్పెషాలిటీ కోర్సులను ఏకైక వైద్య కళాశాలగా గుర్తింపు పొందింది.
ఈ.ఎస్.ఐ. సంస్థ దేశ వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఈ.ఎస్.ఐ భీమా లబ్ధిదారులకు సేవలందిస్తున్నది. మన ఈ.ఎస్.ఐ. వైద్య కళాశాలలో ఇంకా నాలుగు కొత్త వైద్య పరికరాలను అందుబాటులోకి తేవడం సంతోషకరమని, దీనితో వైద్య సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉందనీ కిషన్ రెడ్డి తెలిపారు. 2019 సంవత్సరానికి గాను ఇఎస్ఐ కార్పొరేషన్ నడిపిస్తున్న సంస్థల్లో ఉత్తమ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు ఉత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును కూడా అందుకుంద ని, రోగుల సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వంటి అన్ని రంగాలలో వైద్య కళాశాల ప్రారంభమైనప్పటి నుండి అద్భుతమైన పురోగతి సాధించిందనీ కిషన్ రెడ్డి అన్నారు.
ఈరోజు ప్రారంభించిన నాలుగు పరికరాల్లో ఇన్నోవేటివ్ పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ (RTPCR), రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టం, కోవిడ్ సేఫ్ ఇంకుబెటర్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్ ఇంకా రౌండ్ ది క్లాక్ ఇన్ హౌజ్ డయాలసిస్ సర్వీస్ లు, రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు అందించడానికి ఎంతో ఉపయోగకరమని కిషన్ రెడ్డి అన్నారు.
ఐపీ (భీమా పొందిన వ్యక్తి) ని విఐపి గా భావించి చికిత్స చేయడంతో పాటు ఈ సంస్థలోని అభివృద్ధి చేసిన అత్యాధునిక సౌకర్యాలతో బయటి ఆసుపత్రులకు రిఫరెల్స్ బాగా తగ్గాయని, ఇక్కడ ప్రారంభించిన మొట్ట మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ద్వారా ఇప్పటివరకు సుమారు 80 వేల నమూనాలను పరీక్షించడం గొప్ప విషయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.