BRS: 154 ఎకరాల్లో, 10 లక్షల మందితో.. BRS రజతోత్సవ సభకు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రయాణం మొదలుపెట్టి, బీఆర్ఎస్గా మారిన భారత రాష్ట్ర సమితి నేడు (ఆదివారం) 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ యంత్రాంగం నెల రోజులుగా పూర్తిస్థాయిలో కృషి చేసింది. సుమారు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

BRS
14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 9.5 ఏళ్లు అధికారంలో ఉండి, ఏడాదిన్నరుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ తాజా ఎన్నికల పరాజయాల తర్వాత ఈ భారీ సభ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రసంగించబోతుండటంతో సభపై ఆసక్తి పెరిగింది.
సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. కేవలం 15 నెలల్లోనే కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వెనక్కి పోయిందని ఆయన అభిప్రాయం. ఇదివరకే బహిరంగంగానే ఆయన విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో మరింత బలంగా ఈ విషయాలను ప్రజలకు వివరించనున్నారు.
సభ కోసం ఎల్కతుర్తి పరిసరాల్లో 1,213 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 154 ఎకరాల్లో సభాస్థలం, 1,059 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా 10.8 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఆరోగ్య సమస్యల కోసం 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు.
CM KCR
సభకు హాజరయ్యే ప్రజల ట్రాఫిక్ నియంత్రణకు 2,500 మంది వాలంటీర్లు, 1,100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. సభావేదికపై కేసీఆర్తో పాటు 500 మంది వరకు వేదికపై కూర్చోనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభావేదిక సమీపంలోని హెలిప్యాడ్కి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు వేదికపైకి వచ్చి సుమారు గంటపాటు ప్రసంగించనున్నారు.