రికార్డు స్థాయిలో కృష్ణా జలాలు వాడుకొన్న తెలుగు రాష్ట్రాలు
ఈ నీటి సంవత్సరంలో కృష్ణా నది జలాలను రెండు తెలుగు రాష్ట్రాలు రికార్డు స్థాయిలో వినియోగించుకొన్నాయి. ఏపీ వాటాను ఇప్పటికే పూర్తి చేసింది. మరో వైపు తెలంగాణ రాష్ట్రం ఇంకా తన వాటా నీటిని వాడుకోవాల్సి ఉంది.
కృష్ణా నది జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరం (2019 జూన్ 1 నుండి 2020 మే 31) వరకు రెండు రాష్ట్రాలు 920.405 టీఎంసీల నీటిని వాడుకొన్నారని కృష్ణా రివర్ బోర్డు ప్రకటించింది.
గత ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది.దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు పలు దఫాలు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 647.559 టీఎంసీలు వినియోగించుకొంది. తెలంగాణ 272.846 టీఎంసీలు వినియోగించుకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో తన వాటా నీటిని వాడుకొంది. తెలంగాణ రాష్ట్రం తన వాటాలో ఇంకా 60.605 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. ఏపీ రాష్ట్రం తన వాటాను వాడుకొన్నందున ముచ్చుమర్రి, హంద్రీనీవా, సాగర్ కుడికాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ ఏడాది నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది.
శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.
సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుందని కేఆర్ఎంబీ ప్రకటించింది.
సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007 కలుపుకొని 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది.తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుందని కేఆర్ఎంబీ ప్రకటించింది.
ఆర్డీఎస్ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుందని బోర్డు వివరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది.ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటాగా333.451 టీఎంసీలను కేటాయించింది బోర్డు.