16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Virat Kohli: విరాట్ కోహ్లీ త్వరలో జరగనున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొననున్నాడు. ఈ వార్త కోహ్లీ అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశం. జాతీయ జట్టు పరిగణనలో ఉండాలంటే దేశవాళీ టోర్నీలో రాణించాలనే బీసీసీఐ సూచించిన నేపథ్యంలో..

కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్..
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది నిజంగానే బంపర్ బొనాంజా లాంటి వార్త. కింగ్ కోహ్లీ త్వరలో జరగబోయే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సందిగ్ధత నెలకొని ఉండగా.. కోహ్లీనే స్వయంగా తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో, దేశవ్యాప్తంగా ఉన్న అతని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బీసీసీఐ హెచ్చరికలతోనే ఈ నిర్ణయమా.?
టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ దేశవాళీ టోర్నీ ఆడనుండడం క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లీ తన సొంత దేశవాళీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లీ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ రోహన్ జైట్లీ ధృవీకరించాడు. "అవును, కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడు ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేం" అని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ చీఫ్.
విజయ్ హజారే ట్రోఫీ స్టార్ట్ అప్పుడే
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి వచ్చే జనవరి 18 వరకు జరగనుంది. జాతీయ జట్టు పరిగణనలో ఉండాలంటే దేశవాళీ టోర్నీలో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దేశవాళీ ప్రదర్శన కీలకం అనే బీసీసీఐ విధానానికి కోహ్లీ కట్టుబడి ఉన్నట్లు సమాచారం.
చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ ఆడింది..
కోహ్లీ చివరిగా 2009-10 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఆ టోర్నీలో అతను 14 మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు సహా 819 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలు ఆ టోర్నీలో కూడా కింగ్ కోహ్లీ హవా ఎలా కొనసాగిందో స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దేశవాళీ వన్డే ఫార్మాట్లో అదీనూ కోహ్లీ సొంత మైదానంలో అతడి బ్యాటింగ్ చూడటం అభిమానులకు గొప్ప అనుభూతినిస్తుంది.
వరుస సెంచరీలతో దుమ్ములేపుడు.!
ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లలో కోహ్లీ సూపర్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత కోహ్లీ అత్యుత్తమ టచ్లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్లు, షాట్లు ఆడి అభిమానులను అలరించాడు. ఈ రెండు ఇన్నింగ్స్లతో కోహ్లీ మళ్లీ సూపర్ ఫామ్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ అద్భుత ఫామ్ను విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

