Sanju Samson : సంజూ శాంసన్.. ఆయా షేర్ !
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ దుమ్మురేపే నాక్ తో అదరగొట్టాడు. అజేయమైన 97 పరుగులతో భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. సంజూ నాక్ వెస్టిండీస్ను ఓడించి భారత్ ను సెమీఫైనల్కు తీసుకెళ్లింది.

సంజూ శాంసన్ వన్ మ్యాన్ షో.. భారత్ విక్టరీ
సింహం వేచి చూస్తుంది.. కానీ వేటాడటం మర్చిపోదు ! సరిగ్గా ఇదే రీతిలో టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ పోరులో సంజూ శాంసన్ (97* పరుగులతో) ఒంటిచేత్తో భారత్ను గెలిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఈడెన్ గార్డెన్స్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ విండీస్ బౌలర్ల పని పట్టాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినా, తన అజేయమైన విన్నింగ్ నాక్ తో భారత్ సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేశాడు. అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ, తానేంటో ప్రపంచానికి చాటిచెప్పిన సంజూ శాంసన్ ఇప్పుడు రియల్ హీరో !
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 పోరులో సంజూ శాంసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, సంజూ శాంసన్ (97 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్కు చేరుకుంది.
ఒత్తిడిలో సంజూ ప్రతాపం
వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే, సంజూ శాంసన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఇన్నింగ్స్ను నిర్మించారు. మొదట నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్న శాంసన్, ఆ తర్వాత విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
శాంసన్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్లో ఛేజింగ్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ రికార్డు సృష్టించారు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును ఆయన అధిగమించారు. సంజూ ఆడిన షాట్లు, మైదానం నలుమూలలా చేసిన పరుగులు ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులకు మస్తు మజాను అందించాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప రోజు : సంజూ భావోద్వేగం
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యారు. "ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. దేశం కోసం ఆడటం నా కల. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, నాపై నాకే అనుమానాలు కలిగిన రోజులు ఉన్నాయి. కానీ దేవుని దయవల్ల ఈ రోజు ఇది సాధ్యమైంది" అని సంజూ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను డగౌట్ నుండి చూస్తూ మ్యాచ్లను ఎలా ముగించాలో నేర్చుకున్నానని, ఆ అనుభవం ఈ రోజు తనకు ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు.
వరల్డ్ కప్ జట్టులో చోటు.. నిరూపించుకున్న సంజూ
ఈ వరల్డ్ కప్లో సంజూ శాంసన్కు అవకాశం రావడంపై మొదట చాలా చర్చలు జరిగాయి. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా తన ఎంపిక సరైనదేనని సంజూ నిరూపించుకున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ చూపిన సంయమనం, బాధ్యతాయుతమైన బ్యాటింగ్ భవిష్యత్తులో భారత జట్టులో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి.
భారత్ సెమీస్ పోరుకు సిద్ధం
ఈ గెలుపుతో భారత్ వరుసగా ఆరోసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు చేరుకుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్లతో పాటు భారత్ కూడా ఆరుసార్లు సెమీస్ చేరిన జట్ల జాబితాలో చేరింది. సంజూ శాంసన్తో పాటు హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించగా, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా (2 వికెట్లు) రాణించారు. సెమీఫైనల్లో కూడా ఇదే తరహా ప్రదర్శనను కొనసాగించి భారత్ ఫైనల్కు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

