- Home
- Sports
- Valentine's Day : టీమిండియా ఆటగాళ్లకు వాలెంటైన్స్ డే లేనట్లే.. బిసిసిఐ రూల్స్ ఏం చెబుతోంది..!
Valentine's Day : టీమిండియా ఆటగాళ్లకు వాలెంటైన్స్ డే లేనట్లే.. బిసిసిఐ రూల్స్ ఏం చెబుతోంది..!
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో వాలెంటైన్స్ డే కూడా వస్తోంది… దీంతో ఆరోజు తమ కుటుంబసభ్యులతో గడపాలని భావించిన ప్లేయర్లకు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇండియన్ క్రికెటర్స్ కి నో వాలెంటైన్స్ డే..
ICC T20 World Cup 2026 : ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలిచితీరాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటికే రెండుసార్లు వరల్డ్ కప్ ట్రోపీని ముద్దాడినా ముచ్చటగా మూడోసారి అదీ స్వదేశంలో, సొంత ప్రేక్షకుల మధ్య ట్రోపీని అందుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా బిసిసిఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఆటపై ఫోకస్ తప్ప ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది... దీంతో ఆటగాళ్ల వాలెంటైన్స్ డే ఆశలు ఆవిరయ్యాయి.
ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓ విజయాన్ని అందుకుంది... ఇవాళ (ఫిబ్రవరి 12, గురువారం) నమీబియాతో మరో మ్యాచ్ ఆడనుంది. అన్నింటికంటే ముఖ్యం ఫిబ్రవరి 15న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్... చాలారోజుల సస్పెన్స్ తర్వాత ఈ మ్యాచ్ పై క్లారిటీ వచ్చింది. ఇండియాతో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ ఎట్టకేలకు దిగివచ్చింది... దీంతో షెడ్యూల్ ప్రకారమే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఇండియా, పాక్ అభిమానులే కాదు ప్రపంచంలోని క్రికెట్ ప్రియులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రిస్క్ వద్దు...
అయితే టీ20 వరల్డ్ కప్ లోనే కీలకమైన మ్యాచ్ కు ముందు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని బిసిసిఐ భావిస్తోంది. అందుకే మ్యాచ్ కు ముందురోజు ఆటగాళ్లు వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు అనుమతించలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఆటగాళ్లు తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణించవచ్చా అని టీమ్ మేనేజ్మెంట్ బీసీసీఐని అడిగినట్లు తెలుస్తోంది... దీనికి బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చి ఆటగాళ్లకు షాక్ ఇచ్చిందట.
ఆటగాళ్ల ఫోకస్ మొత్తం ఆటపైనే...
''టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ప్లేయర్స్ వెంట కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ వాళ్లు టూర్కు రావాలనుకుంటే సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలి... బోర్డు ఎలాంటి ఏర్పాటు చేయదు. అంతేకాదు ఆటగాళ్ళ ప్రాక్టీస్ కు ఆటంకం కలిగించేలా కుటుంబసభ్యులు వ్యవహరించకూడదు. తమవారిని కలిసి ఉండేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు'' అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
బిసిసిఐ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
బీసీసీఐ నిబంధనల ప్రకారం... ఏదైనా సిరీస్ లేదా టోర్నమెంట్ 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటేనే ఆటగాళ్ల భార్యాపిల్లలు వారివెంట ఉండవచ్చు. ఇలా గరిష్ఠంగా 14 రోజులు మాత్రమే ఆటగాళ్లతో ఉండేందుకు ఫ్యామిలీకి బోర్డు అనుమతి ఇస్తుంది.
గతంలో ఇలాంటి నిబంధనలు ఉండేవి కావు.. కానీ ఫ్యామిలీ వెంట ఉంటే ఆటగాళ్లకు క్రికెట్ పై ఏకాగ్రత తగ్గుతోందని భావించి ఈ రూల్స్ పెట్టింది బిసిసిఐ. ఇప్పుడు కీలకమైన టీ20 వరల్డ్ కప్, పాకిస్థాన్ తో మ్యాచ్ నేపథ్యంలో భారత ఆటగాళ్లను వాలెంటైన్స్ డే వేడుకలకు దూరం పెట్టింది బిసిసిఐ.

