పండగచేస్కోండి మామ.. గుడ్ న్యూస్ వచ్చేసింది.. ధోనీ భాయ్ రెడీ !
MS Dhoni IPL 2026 : ఐపీఎల్ 2026 బజ్ మొదలైంది. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలకు ముగింపు కార్డు పడింది. ఐపీఎల్ 2026లో ఆడటం పై సీఎస్కే సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ 2026లో ధోనీ రీ ఎంట్రీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. 44 ఏళ్ల వయస్సులో కూడా ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మరో సీజన్ ఆడేందుకు సిద్ధమని ధోనీ స్పష్టం చేశారు. “ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్కు అందుబాటులో ఉంటారని మాకు చెప్పారు” అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు. ఇది మాహీ అభిమానులకు పెద్ద పండుగే మరి !
సీఎస్కే మళ్లీ చరిత్ర రాస్తుందా?
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో అత్యంత నిరాశాజనక ప్రదర్శన చేసింది. అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిన సీఎస్కే, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, హోం గ్రౌండ్ లో జరిగిన ప్రతి మ్యాచ్లోనూ ఓడిపోయి చెత్త రికార్డు సృష్టించింది. అయినప్పటికీ, ధోనీ ఆటతీరు మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. గ్రౌండ్ లో బ్యాట్ తో కనిపించింది తక్కువే అయినా.. ఆడిన ప్రతి ఇన్నింగ్స్లో కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పలు మ్యాచుల్లో ఆయన భారీ సిక్సర్లు, వేగవంతమైన ఇన్నింగ్స్ అభిమానుల్లో జోష్ నింపాయి. ఇప్పుడు మళ్లీ ధోనీ ఐపీఎల్ 2026లో అదే శైలిలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అభిమానులు ధోని సీఎస్కేను మరోసారి టైటిల్ దిశగా నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అన్క్యాప్డ్ ప్లేయర్గా సీఎస్కేలోకి ధోని
గత సీజన్లో మెగా వేలం ముందు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసింది. ఐపీఎల్లో కొత్త నియమం ప్రకారం ఐదు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారత ఆటగాళ్లను అన్క్యాప్డ్గా పరిగణిస్తారు. ఆ నియమం ప్రకారం ధోనీని రూ.4 కోట్లు చెల్లించి రిటైన్ చేశారు.
అతనితో పాటు రుతురాజ్ గైక్వాడ్ (₹18 కోట్లు), రవీంద్ర జడేజా (₹18 కోట్లు), మతీష పతిరాణ (₹13 కోట్లు), శివమ్ దూబే (₹12 కోట్లు) కూడా రిటైన్ అయ్యారు.
సీఎస్కే 17వ సీజన్
ధోనీ ఐపీఎల్ తొలి సీజన్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. అయితే, జట్టుపై నిషేధం విధించిన రెండు సంవత్సరాల కాలంలో ఆయన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2026 సీజన్ సీఎస్కేతో ధోనీకి 17వది కాగా, మొత్తం ఐపీఎల్ ప్రయాణంలో ఇది ఆయన 19వ సీజన్ కానుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఆటగాడు విరాట్ కోహ్లీ (ఆర్సీబీ). ధోనీ నాయకత్వంలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్గా నిలిచింది.
ధోనీ ఐపీఎల్ కెరీర్
ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 278 మ్యాచ్లు ఆడి, 38.30 సగటుతో 5439 పరుగులు సాధించారు. ఆయన స్ట్రైక్రేట్ 137.45. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో ఆయన 14 మ్యాచ్ల్లో 196 పరుగులు సాధించి 12 సిక్సర్లు కొట్టారు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్కు వచ్చి అనేక సార్లు జట్టుకు విజయాలు అందించారు.
ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు. ఆయన నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 235 మ్యాచ్లలో 136 విజయాలు సాధించగా, 97 ఓటములు చవిచూసింది. రెండు మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి.