ఇదేక్కడి బ్యాటింగ్ సామీ.. కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్
Karun Nair : గువాహటి టెస్ట్లో భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు సైతం చేతులెత్తేయడంతో ఓటమి అంచుకు చేరుకుంది. దీంతో కరుణ్ నాయర్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట కొత్త చర్చకు దారి తీసింది.

గువాహటి టెస్ట్: భారత్ బ్యాటింగ్ పతనం నెట్టింట హాట్ టాపిక్
గువాహటి బర్సపారా స్టేడియంలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మూడో రోజు టీమిండియా అనూహ్యంగా కుప్పకూలింది. ఇప్పటికే భారీ స్కోరు చేసిన సఫారీలకు సమాధానం ఇవ్వాల్సిన భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు చేరారు.
దీంతో మ్యాచ్ పూర్తిగా సౌతాఫ్రికా జట్టు చేతిలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా, భారత్ మాత్రం 201 వద్ద ఆలౌట్ అయి 288 పరుగుల వెనుకంజలో పడిపోయింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించినా, 65 పరుగుల భాగస్వామ్యం తర్వాత భారత బ్యాటర్ల నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. జైస్వాల్ 58 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. సాయి సుదర్శన్, పంత్, జడేజా, జురెల్, నితీష్ రెడ్డి.. ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
కరుణ్ నాయర్ ట్వీట్ వైరల్
భారత బ్యాటింగ్ కుప్పకూలిన తర్వాత భారత క్రికెటర్ కరుణ్ నాయర్ చేసిన ఒక ట్వీట్ పెద్ద చర్చకు దారి తీసింది. అందులో.. “కొన్ని పరిస్థితులు మనసుకు సుపరిచితమైన అనుభూతి కలిగిస్తాయి… కానీ అక్కడ ఉండకపోవడం బాధను మిగులుస్తుంది” అని పేర్కొన్నాడు.
కరుణ్ ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, ఇది జట్టు ఎంపికలపై అసంతృప్తిగా, ముఖ్యంగా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నిర్ణయాలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్న ట్వీట్గా అభిమానులు భావిస్తున్నారు.
Some conditions carry a feel you know by heart — and the silence of not being out there adds its own sting.
— Karun Nair (@karun126) November 24, 2025
ఈ పోస్ట్ కింద రవిచంద్రన్ అశ్విన్ కూడా నవ్వు ఎమోజీ పెట్టడంతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.
Adei😂 https://t.co/PiLMwlYoCe
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 24, 2025
కరుణ్ నాయర్ కెరీర్: అవకాశాలు తక్కువ, నిరీక్షణ ఎక్కువ
2016లో ఇంగ్లాండ్పై చారిత్రక ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ తర్వాతి సంవత్సరాల్లో జట్టులో స్థిరపడలేకపోయాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు అవకాశమొచ్చినా, 8 ఇన్నింగ్స్ల్లో కేవలం 205 పరుగులు మాత్రమే చేసి తిరిగి జట్టు నుంచి డ్రాప్ అయ్యాడు.
అయితే, దేశవాళీ క్రికెట్ లో కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడుతున్నాడు. 2025/26 రంజీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో 602 పరుగులతో సత్తా చాటాడు. 100+ సగటుతో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న బ్యాటర్ను దక్షిణాఫ్రికా సిరీస్కు ఎందుకు పిలవలేదనే ప్రశ్న అభిమానుల్లో వస్తోంది.
సఫారీ జోరు.. మార్కో జాన్సెన్, హార్మర్ డబుల్ అటాక్
భారత్ బ్యాటింగ్ను మార్కో జాన్సెన్ స్పెల్ దెబ్బకొట్టింది. ఆరు వికెట్లతో భారత ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. సిమన్ హార్మర్ మూడు వికెట్లు తీసి జాన్సెన్కు అద్భుత సహకారం అందించాడు.
దక్షిణాఫ్రికా ఇప్పుడు 314 పరుగుల ఆధిక్యంలో ఉంది, ఇంకా రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తోంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తుండడంతో భారత్ ముందు భారీ టార్గెట్ చేరే అవకాశముంది.
టీమిండియా బ్యాటింగ్ సంక్షోభం.. భవిష్యత్తు ఆందోళన
సీనియర్ స్టార్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టాప్ ఆర్డర్లో స్థిరత్వం దొరకలేదు. పంత్, రాహుల్, జడేజా వంటి సీనియర్లు కూడా అవసరమైనప్పుడు నిలబడలేకపోతున్నారు. జైస్వాల్ వంటి యంగ్ ప్లేయర్లు సెంచరీలు చేసి ప్రభావం చూపుతున్నా, మొత్తం బ్యాటింగ్ యూనిట్లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, కరుణ్ నాయర్ ట్వీట్ భారత జట్టులో ప్రస్తుత అనిశ్చితిని ప్రతిబింబించినట్లుగా కనిపిస్తోంది.

