IND vs WI: గంభీర్ మైండ్ గేమ్.. సామీ మాస్టర్ ప్లాన్ ! అద్భుతానికి అడుగు దూరంలో భారత్
IND vs WI: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరుగుతున్న కీలకమైన సూపర్-8 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026: సెమీస్ బెర్తు కోసం భారత్-వెస్టిండీస్ హోరాహోరీ
టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్కు చేరుకుంది. టోర్నీలో 52వ మ్యాచ్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ సూపర్-8 పోరు ఇరు జట్లకు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తడుముకోకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఛేజింగ్కే మొగ్గు చూపినట్లు సూర్య తెలిపాడు. ఈ మ్యాచ్ ఫలితం సెమీఫైనల్ సమీకరణాలను తేల్చనుంది.
ప్లేయింగ్ ఎలెవన్: మార్పుల్లేని భారత్.. విండీస్ జట్టులోకి అకీల్ హొస్సేన్
ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్లో జింబాబ్వేపై ఘనవిజయం సాధించిన జట్టునే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించాడు. మరోవైపు, వెస్టిండీస్ జట్టు ఒక ముఖ్యమైన మార్పు చేసింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
భారత ప్లేయింగ్ XI: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొస్సేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
సెమీఫైనల్ సమీకరణాల: గెలిస్తే సెమీస్కు.. ఓడితే ఇంటికి
ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్ టిక్కెట్లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక స్థానం కోసం భారత్, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. సూపర్-8 పాయింట్ల పట్టికలో భారత్, వెస్టిండీస్ రెండు జట్లు తలో 4 పాయింట్లతో ఉన్నాయి. అయితే, నెట్ రన్ రేట్ పరంగా వెస్టిండీస్ మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్కు దూసుకెళ్తుంది, ఓడిన జట్టు టోర్నీ నుండి అవుట్ అవుతుంది. టీమ్ ఇండియా తన మొదటి సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, జింబాబ్వేపై 72 పరుగుల విజయంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చింది.
గంభీర్ వర్సెస్ సామీ: వ్యూహకర్తల పోరు ఇది
మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు ఒకెత్తయితే, డగౌట్లో ఇద్దరు దిగ్గజ కోచ్ల మధ్య వ్యూహ ప్రతివ్యూహాల పోరు మరొక ఎత్తు. భారత కోచ్ గౌతమ్ గంభీర్, వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ తలపడుతున్నారు. సామీ సారథ్యంలో వెస్టిండీస్ 2012, 2016లో టీ20 ప్రపంచకప్లను ముద్దాడింది. మరోవైపు, గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. గంభీర్ కోచింగ్లో భారత్ గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఇద్దరు దిగ్గజాలలో ఈరోజు ఎవరి వ్యూహం ఫలించనుందో చూడాలి.
పిచ్ రిపోర్ట్.. వాతావరణ అంచనా
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ పొడిగా ఉంది. స్పిన్నర్లకు ఈ పిచ్ సహకరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇరు జట్లలో బలమైన హిట్టర్లు ఉన్నందున భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్పై 180 పరుగుల కంటే ఎక్కువ స్కోరు సాధిస్తే అది పోరాడగలిగే లక్ష్యం అవుతుంది. వాతావరణం విషయానికి వస్తే, అక్యూవెదర్ ప్రకారం వర్షం కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 24 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెస్టిండీస్పై భారత్కు రికార్డు అంత ఆశాజనకంగా లేదు. గత 4 మ్యాచుల్లో విండీస్ 3 గెలిస్తే, భారత్ ఒక్కటే గెలిచింది. ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్లో ఇప్పటివరకు ఓటమిని ఎరుగకపోవడం విశేషం.

