IND vs ENG : భయ్యా.. ఇది భారత్ పవర్ అంటే ! ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు !
India vs England : టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. సంజూ శాంసన్, శివం దూబే మెరుపులతో ఇంగ్లాండ్పై 253 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సంజూ 89, దూబే 43.. సెమీస్లో ఇంగ్లాండ్ను ఊచకోత కోసిన టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో టీమిండియా బౌండరీల మోత మోగించింది. ఇంగ్లాండ్ ను ఉతికారేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు భారత బ్యాటర్లు సినిమా చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
సంజూ శాంసన్ వీరవిహారం
ఓపెనర్ అభిషేక్ శర్మ (9) త్వరగానే అవుట్ అయినప్పటికీ, సంజూ శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలో 15 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో దొరికిన అవకాశాన్ని శాంసన్ అద్భుతంగా మలచుకున్నాడు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శాంసన్ ధాటికి పవర్ప్లే ముగిసేసరికి భారత్ 67 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్, దూబే మెరుపులు
శాంసన్కు తోడుగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివం దూబే (43 పరుగులు, 25 బంతుల్లో) కూడా సిక్సర్ల మోతను కొనసాగించాడు. అదిల్ రషీద్ బౌలింగ్లో వరుస సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డెత్ ఓవర్లలో హార్దిక్, తిలక్ హంగామా
చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తమ వంతు బాధ్యతను పూర్తి చేశారు. తిలక్ వర్మ కేవలం 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. వీరి మెరుపులతో భారత్ 250 పరుగుల మార్కును సునాయాసంగా దాటేసింది.
బౌలర్ల బేజారు.. రికార్డుల మోత
భారత బ్యాటర్ల దాడికి ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. విల్ జాక్స్ 2 వికెట్లు తీసినప్పటికీ 40 పరుగులు ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో భారత్ మొత్తం 19 సిక్సర్లు బాది రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ సమం చేసింది.
ఛేజింగ్ సాధ్యమేనా?
వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ, 254 పరుగుల లక్ష్యం అంటే సెమీఫైనల్ వంటి ఒత్తిడి ఉన్న మ్యాచ్లో చాలా కష్టంతో కూడుకున్న పని. గతంలో ఇదే గ్రౌండ్ లో ఇంగ్లాండ్ 230 పరుగులను ఛేజ్ చేసిన రికార్డు ఉంది. అయితే భారత్ నిర్దేశించిన ఈ కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

