IND vs NZ : ఆ గ్రౌండ్లో రోహిత్, కోహ్లీలకు శని పట్టిందా? 17 ఏళ్లుగా తీరని కోరిక !
IND vs NZ : భారత్-న్యూజిలాండ్ మధ్య రాజ్కోట్లో రెండో వన్డే జరగనుంది. అయితే ఈ మైదానంలో గడిచిన 17 ఏళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఒక్క సెంచరీ కూడా లేదు. ఈ మ్యాచ్లో వారి రికార్డు మారుతుందా?

IND vs NZ: ఈసారైనా కొడతారా? రాజ్కోట్ గండం దాటుతారా?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు అందరి దృష్టి రాజ్కోట్ గ్రౌండ్ లో జరగబోయే రెండో వన్డేపైనే ఉంది.
జనవరి 14న జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఎంతో కీలకం కానుంది. గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ, రాజ్కోట్ మైదానం మాత్రం వీరిద్దరికీ ఇప్పటివరకు కలిసిరాలేదు. 17 ఏళ్లుగా ఊరిస్తున్న ఒక అసంపూర్ణ కలను నెరవేర్చుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు.
రాజ్కోట్ గండం.. కోహ్లీ, రోహిత్లకు అగ్నిపరీక్ష
రాజ్కోట్ మైదానంలో టీమిండియా పలు విజయాలు సాధించినప్పటికీ, వ్యక్తిగతంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మాత్రం ఈ గ్రౌండ్ పెద్దగా అచ్చిరాలేదని చెప్పాలి. ఇక్కడ వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా మ్యాచ్లు ఆడుతున్నప్పటికీ, ఒక్కసారి కూడా మూడు అంకెల స్కోరును అందుకోలేకపోయారు.
గత మ్యాచ్లో రోహిత్ శర్మ 26 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ దురదృష్టవశాత్తు 93 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఇప్పుడు రెండో వన్డే జరగబోయే రాజ్కోట్ పిచ్పై వీరి రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మైదానం వీరిద్దరికీ ఒక రకమైన బ్యాడ్ లక్ గా మారిందనే చెప్పాలి.
విరాట్ కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయి?
రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మైదానాల్లో సెంచరీల రికార్డులు ఉన్నాయి. కానీ రాజ్కోట్లో మాత్రం అతని బ్యాట్ సెంచరీ కొట్టలేకపోయింది. విరాట్ కోహ్లీ ఈ మైదానంలో తన తొలి వన్డే మ్యాచ్ను 2009 డిసెంబర్ 15న ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 5 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ ఐదు ఇన్నింగ్స్లలో కోహ్లీ చేసిన పరుగులు వరుసగా 27, 15, 77, 78, 56.
వీటిలో ఆస్ట్రేలియాపై రెండు మ్యాచ్లు ఆడగా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్లపై ఒక్కో మ్యాచ్ ఆడాడు. 77, 78 పరుగుల వద్ద అవుటైన సందర్భాలు ఉన్నప్పటికీ, సెంచరీ మాత్రం పూర్తి చేయలేకపోయాడు. న్యూజిలాండ్తో జరిగే ఈ మ్యాచ్లోనైనా ఈ దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా అంతే..
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గణాంకాలను పరిశీలిస్తే, రాజ్కోట్ మైదానం అతనికి కూడా పెద్దగా కలిసిరాలేదు. రోహిత్ శర్మ తొలిసారిగా 2008 నవంబర్ 14న ఈ మైదానంలో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో అతను 11 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత 2015లో దక్షిణాఫ్రికాపై 65 పరుగులు సాధించాడు.
2020 ప్రారంభంలో ఆస్ట్రేలియాపై 42 పరుగులు చేశాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై 81 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, సెంచరీ మార్కును మాత్రం అందుకోలేకపోయాడు. ఇలా కోహ్లీ లాగే రోహిత్ కూడా రాజ్కోట్లో సెంచరీ దాహంతో ఉన్నాడు.
తొలి మ్యాచ్లో భారత్ ఏకపక్ష విజయం
న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్ ముందు 300 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, విరాట్ కోహ్లీ 93 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 49 పరుగులతో రాణించాడు. చివర్లో కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా చెరో 29 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ప్రస్తుతం సిరీస్లో వెనుకబడి ఉన్న న్యూజిలాండ్ జట్టుకు, జనవరి 14న జరగబోయే రెండో వన్డే చావో రేవో లాంటిది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కివీస్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు, టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవడంతో పాటు, రోహిత్-కోహ్లీలు తమ రాజ్కోట్ రికార్డును సరిదిద్దుకోవాలని చూస్తున్నారు.

