టీమిండియా టెస్టుల్లో డౌన్ఫాల్… గంభీర్ నిర్ణయాలే కారణమా? ముంచేశాడు !
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్కు టెస్టుల్లో వరుస వైట్వాష్లు ఎదురయ్యాయి. టీమిండియా టెస్టు స్థాయి మరింత దిగజారుతున్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

గంభీర్ హయాంలో టీమిండియాకు వరుస దెబ్బలు
టీమిండియా మరో వైట్ వాష్ కు గురైంది. చెత్త ఆటతీరుతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత జట్టు, కోచింగ్ విభాగం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత టెస్టు జట్టు మరింత ఘోరంగా విఫలమవుతోంది.
యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం, సీనియర్లను పక్కకు జరపడం, ఆల్రౌండర్లపై ఎక్కువ నమ్మకం.. ఇలాంటి నిర్ణయాలు ఒకదానిపై మరొకటి మోయలేని భారంగా మారాయి. కేవలం ఏడాది వ్యవధిలో రెండు పెద్ద జట్ల చేతిలో వైట్వాష్ అవడం భారత టెస్టు చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైన భారత్, ఈసారి సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.
సీనియర్లు దూరం కావడంతో భారత్ కు తీవ్ర నష్టం
టెస్టు క్రికెట్లో భారత్ ఆధిపత్యానికి పునాది వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురు ఒకే ఏడాది భారత జట్టుకు వీడ్కోలు చెప్పారు. న్యూజిలాండ్ సిరీస్ వైట్వాష్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆస్ట్రేలియా సిరీస్లోని పరాభవం తరువాత రోహిత్, కోహ్లి కూడా టెస్టులకు గుడ్బై చెప్పారు.
వీరంతా స్వచ్ఛందంగా తప్పుకున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, జట్టులోని వాతావరణం, సెలక్షన్ ఒత్తిడులు, అకస్మాత్తుగా వచ్చిన మార్పులతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగింది. ఇప్పుడు ఇవన్నీ మళ్లీ గంభీర్ ను టార్గెట్ గా చూపుతున్నాయి. ఈ ముగ్గురు వెళ్లిపోవడం భారత టెస్టు జట్టులో అనుభవాన్ని పూర్తిగా దూరం చేసింది.
వరుస వైఫల్యాలతో కోచ్ నిర్ణయాలపై ప్రశ్నలు
సౌతాఫ్రికా టెస్టు సిరీస్లో భారత్ ప్రదర్శన పూర్తిగా నిరుత్సాహ పరిచింది. కొల్కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్, గువాహటి టెస్టులో 400కుపైగా పరుగుల తేడాతో పరాభవం పాలయ్యింది. ఇది కేవలం ఓటమి కాదు.. టెస్టు జట్టులో ఉన్న లోపాలను బహిర్గతం చేసిన సందర్భంగా నిలిచింది.
టాప్ ఆర్డర్లో స్థిరమైన బ్యాటర్ లేకపోవడం, బౌలింగ్ ఎటాక్లో సమతౌల్యం లేకపోవడం, ప్రతీ మ్యాచ్లో కొత్త కాంబినేషన్ ప్రయత్నించడం.. ఇవి అన్నీ జట్టును మరింత దెబ్బకొట్టాయి. దీనికి తోడు జట్టు ఎంపిక పై కూడా విమర్శలు వస్తున్నాయి.
మాజీల ఘాటు వ్యాఖ్యలు
మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆట తీరుపై నిరాశను వ్యక్తం చేస్తూ గంభీర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం కోచ్ నిర్ణయాలే అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.
వరుస వైట్వాష్లు, వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు, సీనియర్ల తప్పుకోవడం, జట్టులోని అంతర్గత సమస్యలు.. ఇన్నీ కూడి ఇప్పుడు బీసీసీఐ దృష్టి కోచ్ గంభీర్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఇదే గంభీర్కు చివరి టెస్టు అనే చర్చ మొదలైంది.
గత 15 నెలల్లో వన్డేలు, టెస్టుల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాలు, అనేక వివాదాస్పద సెలక్షన్ నిర్ణయాలతో ఏర్పడిన ఈ పరిస్థితులను మార్చడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్, మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.

